విద్యతోనే సమానత్వం సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కనిన సమానత్వం, న్యాయం, విద్యా హక్కులు నిజంగా అమలు కావాలంటే ప్రతి ప్రభుత్వానికి దృఢ సంకల్పం అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Minister Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బాబూ జగ్జీవన్రామ్ (Jagjivanram) భవన్లో జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విద్యకు ప్రాముఖ్యత ఇచ్చే విధానాలే ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆధునిక తెలంగాణలో ముందుకు నడిపించగలవని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జరుగుతుందన్న ఆయన వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రాసంగికంగా నిలిచాయి.
చదువుతోనే మార్పు సాధ్యమవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. “చదువు ఎప్పుడూ మనకు మార్గం చూపుతుంది. మహనీయులు కులాల వల్ల కాదు, చదువుల వల్ల గుర్తింపు పొందారు. కులవృత్తులు మాత్రమే కాదు, పాఠశాలలే మార్గదర్శకాలు కావాలి” అని ఆయన ఉద్ఘాటించారు. చదువు ద్వారా సమాజంలోని అసమానతలు తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు. “విద్యార్థి చదువు, ఆరోగ్యం రెండు బలంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు కూడా అంతే అవసరం” అని పేర్కొంటూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని తెలియజేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలను పక్షపాతం లేకుండా ఎదిగేలా చేయాలి
గత పాలకుల వైఖరిని విమర్శిస్తూ, “ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు చదువులు వద్దని, వారు కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు. దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువత ఆశలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆయన విమర్శించారు. “మాజీ ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత – 55 వేల పోస్టుల భర్తీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ, ఇంకా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. “నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆరు నెలలు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు” అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
Read also: Harish Rao: కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ