ఎన్నికల ప్రక్రియ బలోపేతంలో మీడియా పాత్ర కీలకమని పి. పవన్ వెల్లడి
భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి. పవన్(P. Pawan), ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రాముఖ్యతను, పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా పాత్రను నొక్కి చెప్పారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యూనికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఇది కేవలం సమాచార వ్యాప్తి మాత్రమే కాదని, ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించే సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. స్థానిక భాషలలో, స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు మరింత చేరువకావాలని పి. పవన్ మీడియా ప్రతినిధులను ఉద్బోధించారు. ఓటర్లలో ఎన్నికల పట్ల అవగాహన, విశ్వాసం పెంపొందించడానికి మీడియా నిరంతరం కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ECI నూతన కార్యక్రమాలు, సంస్కరణలు: పౌరులకు మెరుగైన సౌకర్యాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలు, ప్రక్రియాత్మక సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు మరియు వనరులను వివరించారు.
ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు (SSR) కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటర్ సమాచార స్లిప్లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నంబర్ మరియు పార్ట్ నంబర్ను స్పష్టంగా చూపించనున్నామని అన్నారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను ఆర్జీఐ డేటాబేస్ నుండి సేకరించి, ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో పోలింగ్ (Polling) కేంద్రానికి గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకే అనుమతిస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని, అపార్టుమెంట్లు, కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
డూప్లికేట్ EPIC నంబర్ల సమస్యకు పరిష్కారం, డిజిటల్ అందుబాటు
యూనిక్ EPIC నంబర్ పద్ధతిని అమలు పరచడం ద్వారా డూప్లికేట్ EPIC నంబర్ల సమస్య పరిష్కరించడం జరిగిందన్నారు. భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని పలు వెబ్సైట్ల ద్వారా పౌరులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
Read also: Pawan Kalyan : యోగా దినోత్సవం భారత్కు లభించిన గొప్ప గౌరవం: పవన్ కల్యాణ్