పాక్కు సమాచారం లీక్ చేస్తున్న జవాన్ అరెస్టు: జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారుతున్న గూఢచారులు
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూసిన తరువాత కేంద్ర హోంశాఖ తీవ్రంగా అప్రమత్తమైంది. కొద్ది రోజులకే దేశవ్యాప్తంగా గూఢచారుల నెట్వర్క్ను ఛేదించేందుకు కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసు విభాగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో గూఢచారులను అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో, తాజాగా ఓ సీఆర్పీఎఫ్ జవాను (CRPF Jawan) పాక్కు రహస్య సమాచారం చేరవేస్తున్నట్టు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
సదరు జవాన్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలు “జాతీయ భద్రత (National security) ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని” వ్యాఖ్యానించింది. “ఈ ఆరోపణలు జాతీయ భద్రతకు, భారతదేశాన్ని సందర్శించే పౌరుల ప్రాణాలకు, అలాగే భారత పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించేవి” అని కోర్టు పేర్కొంది. నిందితుడు పాకిస్థాన్కు ఎలాంటి సమాచారం చేరవేశాడన్న వివరాలను రాబట్టడం అత్యంత కీలకమని అభిప్రాయపడిన కోర్టు, జవాన్ను జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి (NIA custody) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. “దేశ బలానికి, భద్రతకు సాయుధ బలగాలే మూలస్తంభాలు. వాటికి కోలుకోలేని నష్టం కలిగించే ఎలాంటి ప్రయత్నమైనా దర్యాప్తు చేయాల్సిన తీవ్రమైన విషయం” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

హనీట్రాప్, డబ్బు ప్రలోభాల పాలై గూఢచర్యానికి పాల్పడుతున్నవారు
ఈ విచారణలో నిగూఢంగా వెలుగు చూస్తున్న అంశాలు దేశ భద్రతా వ్యవస్థలో లోపాలపై మళ్లీ చర్చను తెచ్చాయి. కొంతమంది వ్యక్తులు డబ్బుకోసం సమాచారం విక్రయిస్తుండగా, మరికొందరు హనీట్రాప్లో చిక్కి సమాచారం లీక్ చేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ద్వారా పాక్ గూఢచారులు భారతీయులను టార్గెట్ చేస్తూ, ఫేక్ ఐడీలతో పరిచయాలు పెంచుతున్నారు. దీనివల్ల చాలా మంది సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు మోసపోతున్నారు.
ఇక తాజా అరెస్టు దేశ రక్షణలో విధులు నిర్వహించే సైనికుల మధ్య విశ్వసనీయతపై ప్రభావం చూపేలా ఉంది. భద్రతా వ్యవస్థలో ఉన్నంత మాత్రాన ఏ ఒక్కరిపై నమ్మకంతో వదిలేయలేమన్న ముసుగులో, కేంద్ర ప్రభుత్వం మరియు విచారణ సంస్థలు నిఘాను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సమాచారం. “దేశ బలానికి మూలస్తంభమైన సాయుధ దళాల్లో ఎవరి వల్లైనా భద్రతకు ముప్పు ఏర్పడితే, అది తీవ్రంగా విచారణ చేయాల్సిన అంశమే” అని కోర్టు పేర్కొనడం గమనార్హం.
ఉగ్రదాడులు, గూఢచారుల మధ్య సంబంధం: కేంద్రం ఉక్కుపాదం
ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడి నేపథ్యంలో పాక్ గూఢచారులకు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఇంటర్నల్ నెట్వర్క్పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఈ దాడికి ముందే భారత భద్రతా దళాల చలనం, తదుపరి మార్గదర్శకాలు వంటి అంశాలను పాక్కు లీక్ చేసిన ఆధారాలు తాజాగా బయట పడుతున్నాయి. నిందితుడిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 15 (ఉగ్రవాద చర్యకు పాల్పడటం), సెక్షన్ 16 (ఉగ్రవాద చర్యకు శిక్ష), సెక్షన్ 18 (కుట్ర మరియు సంబంధిత చర్యలకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటన నేపథ్యంలో, పాకిస్థాన్కు సమాచారం అందిస్తున్న గూఢచారులు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.
Read also: Operation Sindoor: పాకిస్థాన్పై భారత్ ప్రతిస్పందన..