ఇరాన్లోని రెయిన్ బో ఐలాండ్లో ఇటీవలే అద్భుతమైన ప్రకృతి సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కురిసిన వర్షం రక్తం వలే ఎర్రని రంగులోకి మారడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇరాన్లోని రెయిన్ బో ఐలాండ్లో వర్షపు నీరు కొండలపై పడగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. ఈ ప్రవాహం రక్తపు నీరులా కనిపిస్తూ సముద్రంలో కలుస్తోంది. బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారిపోవడం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృశ్యం ప్రకృతిలో ఒక వింతగా, విజువల్ స్పెషల్ఎఫెక్ట్లా కనిపిస్తోంది.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు
ప్రతి సంవత్సరం వేలాదిమంది ఈ “బ్లడ్ రెయిన్” దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఇరాన్కు వస్తారు.
ఇటీవల కొంతమంది టూరిస్టులు ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ, వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొంతమంది ఎర్రని ప్రవాహంలో గంతులు వేస్తూ ఆడుకున్నారు. కొండలపై పడిన వర్షం జలపాతంలా కిందికి దూకుతుండటంతో, సందర్శకులు ఆనందంగా కేరింతలు కొట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఓ నెటిజన్ ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్గా మారింది. “ఇది ప్రకృతిలోని వింతలకు ఓ అద్భుతమైన ఉదాహరణ” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుంది!” అంటూ పర్యాటకులు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు.
ఎర్రని వర్షానికి కారణం ఏమిటి?
రెయిన్ బో ఐలాండ్ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉన్న ప్రదేశం. అక్కడ లావా చల్లారిన తర్వాత ఈ దీవి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాన్ని పొందింది. ఈ ప్రాంత మట్టిలో ఐరన్ ఆక్సైడ్ (Iron Oxide) ఎక్కువ మోతాదులో ఉంది. వర్షపు నీరు ఆ మట్టిని తాకినప్పుడు రసాయనిక మార్పులతో ఎర్ర రంగులోకి మారుతుంది.ఈ ఎరుపు నీరు సముద్రంలో కలిసిపోవడంతో, బీచ్ మొత్తం ఎర్రగా మారిపోతోంది.
దీని వల్ల రక్తం వలే ప్రవహించే ఎర్రని నీటి ప్రవాహం కనబడుతుంది.