ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025–26 విద్యా సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. కానీ, ఈ పరిణామాలపై ఆర్టీసీ ముందుగా సమాచారం పొందకపోవడంతో, విద్యార్థులు ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బస్పాస్ల విషయంలో ఏర్పడ్డ అపోహ
ఇంటర్ విద్యార్థులకు సాధారణంగా జూన్ నుంచి మార్చి వరకు మాత్రమే బస్పాస్లు జారీ చేస్తారు. కానీ ఈసారి ఏప్రిల్ నుంచే తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఆర్టీసీ బస్పాస్ల కోసం డిపోలకు వెళ్లగా, సిబ్బంది తిరస్కరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణ ఖర్చులు స్వయంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించారు.
ఆర్టీసీ అధికారుల నుంచి పాజిటివ్ స్పందన
విషయం పై సీరియస్ అయిన APSRTC అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ నెలకు కూడా బస్పాస్లను రీన్యూ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల విద్యార్థులు ఇకపై ఆర్థిక భారం లేకుండా తరగతులకు హాజరవ్వవచ్చు.
ఇంటర్ ఫలితాల విడుదల త్వరలో
ఇక మరోవైపు ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదలకు సంబంధించి బోర్డు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 6 నాటికి వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత కంప్యూటరైజేషన్ ప్రక్రియ జరిపి, ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో ఫలితాలు విడుదల చేయనున్నారు. గతంలో హాల్ టికెట్లు వాట్సాప్లో అందించినట్లుగానే, ఈసారి ఫలితాలనూ వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ రూపంలో అందించనున్నారు. దీంతో విద్యార్థులు ఇంట్లో నుంచే ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.