భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీనాయక్ స్వగృహానికి చేరుకుని, ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. పవన్తో పాటు మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సవిత వారి కటుంబాన్ని ఓదార్చారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని(Bronze statue) కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహాయం
వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు. ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మురళీనాయక్(Murali Nayak) కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.ఇక మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత రూ. 5 లక్షలు అందించగా బాలకృష్ణ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామం కళ్లితండాను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
Read Also :Murali Nayak : మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ