ఈ కాలంలో పట్టణాల్లో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ట్రాఫిక్ కారణంగా చాలా మంది విద్యార్థులు తమ పరీక్షలను రాయలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు నగరాల్లో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థికి ఇలాంటి సంకటమే ఎదురైంది. దీంతో ఆ విద్యార్థి కూర్చుని బాధపడకుండా వినూత్నం ఆలోచించి సమస్యలను అధిగమించాడు. అతను పారాగ్లైడింగ్ చేసి మెరుపు వేగంలో పరీక్షా కేంద్రం ముందు వాలిపోయాడు. సకాలంలోనే పరీక్షా కేంద్రాన్ని చేరుకుని పరీక్ష రాశాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థి ప్రయాణాన్ని నెట్టింట షేర్ చేయగా.. నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఎలాగైనా పరీక్ష రాయాలనే పట్టుదల
మహారాష్ట్రలోని సతారా జిల్లా వాయ్ తాలుకాలోని పంచగనికి చెందిన సమర్థ్ మహాంగడే అనే విద్యార్థి తన గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కళాశాలలో చదువుతున్నాడు. గతంలో వాయిదా పడిన పరీక్ష మరో అరగంటలో జరగనుందని తెలిసింది. అది తెలుసుకున్న సమర్థ్ ఎలాగైనా పరీక్ష రాయాలనుకున్నాడు. పరీక్ష రాయడానికి ఇంటి నుంచి బయలుదేరగా..
సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు
రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. రోడ్డుపై ఎంతకూ కదలని ట్రాఫిక్ లో చిక్కుకున్నానని తెలుసుకున్న సమర్థ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే సాహస క్రీడల నిపుణుడైన గోవింద్ యెవాలె సాయాన్ని కోరాడు. దీనికి ఆయన అంగీకరించడంతో పారాగ్లైడింగ్ దుస్తులను ధరించి, కాలేజీ బ్యాగును భుజాన వేసుకుని గాల్లో కాలేజీని చేరుకున్నాడు. సకాలంలో పరీక్షా కేంద్రాన్ని చేరుకుని పరీక్షను రాశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.