భారత అంతరిక్ష కేంద్ర ప్రయాగంలో మరో మైలురాయిని పూర్తి చేసుకుంది. విజయవంతంగా స్పేస్ డాకింగ్ పూర్తి చేసుకుంది. కొత్త సంవత్సర కానుకగా చరిత్రలో నిలబడడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
ఈ మిషన్లో భాగంగా ఎస్డీఎక్స్01 (ఛేజర్), ఎస్డీఎక్స్02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విజయాశ్వం పీఎ్సఎల్వీ-సీ60.. వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూ కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ కక్ష్యలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్దిరోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం (డాకింగ్) చేయనున్నారు.

జంట ఉపగ్రహాల ప్రయోగం
భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఎంతో కీలకమైన ‘స్పేస్ డాకింగ్’ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. స్పేస్ డాకింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనల కేంద్రం ఇస్రో చేపట్టిన జంట ఉపగ్రహాల ప్రయోగం (స్పేడెక్స్)లో తొలి అడుగు ఘనంగా పడింది.
ఈ మిషన్లో భాగంగా చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎ్సఎల్వీ-సీ60 రాకెట్.. వాటిని జాగ్రత్తగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9.58 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కానీ.. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 10:15 గంటలకు నింగిలోకి ఎగిరిన రాకెట్.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం తొలి ఉపగ్రహాన్ని 15.10 నిమిషాలకు, రెండో ఉపగ్రహాన్ని 15.13 నిమిషాలకు భూమికి 476 కిలోమీటర్ల ఎత్తున, వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.