ప్రముఖ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర బడ్జెట్ 2025-26 ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ స్థాయిలో వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కోరింది.
ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయడంతో పాటు, గృహ ఖర్చులలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయనీ, అందువల్ల సుంకం తగ్గించడం కీలకమని పేర్కొంది.
ఇంధనంపై విధించే ఎక్సైజ్ సుంకం పెట్రోల్ ధరలో 21 శాతం, డీజిల్ ధరలో 18 శాతం ఉంటుందని CII తెలియజేసింది. మే 2022 నుండి అంతర్జాతీయ క్రూడ్ ధరలు 40 శాతం తగ్గినా, ఎక్సైజ్ సుంకాలు అనుగుణంగా సర్దుబాటు చేయలేదని విమర్శించింది. ఈ సుంకాల తగ్గింపుతో ద్రవ్యోల్బణం తగ్గడం, వినియోగదారులకు ఎక్కువ ఆదాయం లభించడం జరుగుతుందని చెప్పింది.
CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానిస్తూ, “దేశీయ వినియోగం భారత వృద్ధి కథనానికి కీలకం. అయితే ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని వినియోగదారులకు ఆదాయాన్ని పెంచడం, ఆర్థిక వృద్ధిని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.

తక్కువ ఆదాయ గృహాలకు మద్దతుగా PM-KISAN పథకం కింద వార్షిక చెల్లింపులను రూ.6,000 నుండి రూ.8,000కి పెంచాలని సిఫార్సు చేశారు. అలాగే, PMAY-G మరియు PMAY-U పథకాల కింద యూనిట్ ఖర్చులను కూడా సవరించాల్సిన అవసరాన్ని వివరించారు. గ్రామీణ ప్రాంతాల పునరుద్ధరణ కోసం వినియోగ వోచర్లను ప్రవేశపెట్టాలని, ఇవి నిర్దిష్ట వస్తువుల మరియు సేవల వినియోగాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పారు.
CII, వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా మధ్య మరియు తక్కువ ఆదాయ వర్గాల కొనుగోలు శక్తిని పెంచవచ్చని పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరానికి రూ.20 లక్షల వరకు ఆదాయానికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రతిపాదించింది.
బ్యాంక్ డిపాజిట్ల వృద్ధిని పెంచడానికి, వడ్డీ ఆదాయానికి తక్కువ పన్ను రేటును అమలు చేయాలని, ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ కాలాన్ని ఐదు సంవత్సరాల నుండి మూడేళ్లకు తగ్గించాలని సూచించింది.
CII బడ్జెట్ సూచనల్లో దృష్టి పెట్టిన కీలక అంశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం మరియు పన్ను సంస్కరణలను చేపట్టడం.