ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆధారాలు లేకుండానే అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు మోపడం వంటి అంశాలపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఈడీ విచారణ పద్ధతులపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కాం కేసుతో పాటు పలు ఇతర కేసులలో ఈడీ తీరును గమనించిన సుప్రీంకోర్టు, ఏజెన్సీ వ్యవహార శైలికి ఒక అలవాటుగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.నిందితుడు నేరం చేసి రూ.40 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ చెప్పలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. ఏదైనా కంపెనీకి, నిందితునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్పలేకపోతున్నదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు గత వారం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. “దర్యాప్తు తనదైన వేగంతో జరుగుతూ ఉంటుంది. అది శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. మూడు ఛార్జిషీట్లను దాఖలు చేశారు. ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుతూ మీరు వాస్తవంగా శిక్షిస్తున్నారు. ఈ ప్రక్రియను మీరు శిక్షగా మార్చేశారు. ఇదేదో ఉగ్రవాది లేదా ట్రిపుల్ మర్డర్ కేసు కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆధారాలు
సుప్రీంకోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తే, ఆధారాలు లేని అరెస్టులుపై మండిపడింది. ఈడీ అనేక సందర్భాల్లో పక్కా ఆధారాలు చూపకుండానే వ్యక్తులను అరెస్టు చేస్తోందని సుప్రీంకోర్టు పదేపదే ప్రస్తావించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద అరెస్ట్ చేయడానికి నిర్దిష్ట కారణాలు, బలమైన ఆధారాలు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం అనుమానాలతో లేదా బలహీనమైన ప్రాథమిక ఆధారాలతో అరెస్టులు చేయడం రాజ్యాంగం లో వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని కోర్టు అభిప్రాయపడింది.ఈడీ తప్పుడు కేసులు పెడుతోందని, అరెస్టులు చేయడం ఒక అలవాటుగా మారిందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి. ఇది ఈడీ దర్యాప్తు ప్రక్రియలో పక్షపాతం లేదా దురుద్దేశాలు ఉన్నాయేమోననే అనుమానాలకు తావిస్తోంది. చట్టాన్ని అమలు చేసే సంస్థ చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సూచిస్తున్నాయి.

విశ్వసనీయత
సుప్రీంకోర్టు ఈడీపై వ్యక్తం చేసిన ఆగ్రహం కేవలం ఒక కేసుకో లేదా ఒక సంఘటనకో పరిమితం కాదు .ఈడీ తన విధానాలను పునఃపరిశీలించుకుని, చట్ట పరిధిలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.రాజ్యాంగ విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు తన పాత్రను మరోసారి చాటిచెప్పిందని ఈ సంఘటన నిరూపిస్తోంది.
Read Also: Maulana Abdul Aziz Ghazi: భారత్తో యుద్ధానికి మద్దతుపై మౌనం వహించిన లాల్ మసీదు