ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని చేపట్టింది.భవనాలతో పాటుగా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది.అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డులో క్లిష్టమైన మూడో దశకు అమరావతి అభివృద్ధి సంస్థ త్వరలోనే టెండర్లు పిలవనున్నది. ఈ నిర్మాణాన్ని ప్రకాశం బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కి.మీల పొడవైన రహదారిని దాదాపు రూ.593.03 కోట్లతో చేపట్టేందుకు ఇటీవల అమరావతి అభివృద్ధి సంస్థ ఆమోదముద్ర వేసింది.ఈ రోడ్డు మణిపాల్ ఆసుపత్రి దగ్గర చెన్నై-కోల్కతా నేషనల్ హైవేను కనెక్ట్ చేయనుంది.అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును మూడో దశగా పిలుస్తున్నారు. మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో ఇది కలుస్తుంది. ఇక్కడ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్(Trumpet Interchange)ను నిర్మిస్తారు. మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ నుంచి పాత మద్రాసు రహదారి మీదుగా వెళుతుంది. మధ్యలో 320 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి కూడా ఉంటుంది. దీని నిర్మాణానికి 48 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. రెండు సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు.సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారితో అనుసంధానించే చోట మూడు ర్యాంప్లు నిర్మిస్తారు. అమరావతి నుంచి విజయవాడ మీదుగా 232 మీటర్లు, గుంటూరు నుంచి అమరావతి(Amaravati) వైపు 280 మీటర్లు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా వెళ్లేందుకు 115 మీటర్లు, మూడు ర్యాంప్లు ఉంటాయి. అంతేకాకుండా 1.52 కి.మీ. పొడవైన ఎలివేటెడ్ కారిడార్ సైతం ఉంటుంది. దానిలో భాగంగా పాత మద్రాసు రోడ్డులో బకింగ్హాం కెనాల్పై ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జి వైపు 320 మీటర్ల పొడవైన ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జి (కేబుల్ బ్రిడ్జి) నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా 99.6 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇందులో ఉంటుంది. ఈ రోడ్డులో ఇంకా ఒక మేజర్ బ్రిడ్జి, రెండు మూడు వెహికిల్ అండర్ పాస్లను నిర్మిస్తారు.

ప్రభుత్వం
రాజధానిలోని దొండపాడు వద్ద నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు 21.7 కి.మీ.ల పొడవు ఉంటుంది. తొలి దశలో దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం(Mantena Satyanarayana Raju Ashram) వరకు 2019 కి ముందుగానే టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం గమనార్హం. దాని పొడవు సుమారు 14 కి.మీ వరకు ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజీ వరకు 4.2 కి.మీ.ల దూరం ఉంటుంది.రహదారి నిర్మాణం భూ సేకరణలో కొన్ని సమస్యల వల్ల నిలిచిపోయింది. రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించిన కూటమి ప్రభుత్వం మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులను చేపట్టింది. దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు(Seed Access Road) రెండో దశగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో అక్కడక్కడా భూ సమీకరణకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు చేస్తూనే రైతులతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ 4.2 కి.మీ.లో 1.5 కి.మీ. పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
Read Also : Andhra Pradesh: ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్