Kashmir : తొలిసారి వందేభారత్ రైలు కాశ్మీర్లోయలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏప్రిల్ 19న తొలి వందే భారత్ రైలు కాట్రా నుంచి కశ్మీర్కు పరుగులు పెట్టనుంది. ఉదంపుర్-శ్రీనగర్- బారాముల్లా మధ్య 272 కి.మీల మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 19న ప్రధాని మోడీ ఉదంపుర్ వస్తారని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

కొనసాగుతున్న జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు
అనంతరం కాట్రా నుంచి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ- కాట్రా- శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు లింక్ ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయిందని.. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రారంభోత్సవంతో కశ్మీర్కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరనట్లవుతుంది.
ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు
కశ్మీర్ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ.. అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు ఉండగా.. వీటిలో 12.75 కి.మీల మేర నిర్మించిన టీ-49 సొరంగం అత్యంత పొడవైనది. అలాగే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి. వీటిలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు.