ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని వంటి విదేశీ AI యాప్ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్ను తప్పక అనుమతించాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.

అధికారిక పనుల కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై AI సాధనాలను ఉపయోగించటం మానుకోవాలని ఆపాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించినట్లు పలు జాతీయ మీడియా కథానాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వం సొంత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు చైనాకు చెందిన డీప్ సీక్ వాడకంపై నిషేధాజ్ఞలు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వాడుతున్న ఏఐ యాప్లు డేటా భద్రతకు, గోప్యతకు భంగం కలిగించవచ్చనే భయాందోళనే అందుకు ప్రధాన కారణం.