తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) — ప్రపంచంలోనే అతి ప్రముఖమైన హిందూ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. రోజుకి లక్షలాది భక్తులు తరలి వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునే అనుభవం ఎంతో మానసిక శాంతిని కలిగించేదిగా ఉంటోంది. కానీ ఇటీవల కాలంలో సేవల నిర్వహణపై కొన్ని అసంతృప్తికరమైన ఫిర్యాదులు వెలువడుతున్న నేపథ్యంలో, టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి వెంకయ్య చౌదరి హోటళ్ల యజమానులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.

భక్తుల రద్దీ – స్వామివారి దర్శన వివరాలు
2025 మే 8 నాడు శ్రీవారి దర్శనం కోసం 71,001 మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. ఇందులో 28,637 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా ₹3.25 కోట్లు ఆదాయం టీటీడీకి సమకూరింది. ఈ సంఖ్య తిరుమలలో భక్తుల పెరుగుతున్న నమ్మకాన్ని సూచించగా, నిర్వహణలో ఉన్న లోపాలు మాత్రం ఆ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని అధికారి వ్యాఖ్యానించారు.
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అశాంతి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎనిమిది కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
హోటళ్ల నిర్వహణలో ఉన్న లోపాలు
తిరుమలలోని హోటళ్ల యజమానులతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. తిరుమల ఆస్థానమండపంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి వారికి ఆదేశాలు జారీ చేశారు. భక్తల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించినట్లు చెబుతున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని వెంకయ్య చౌదరి తేల్చి చెప్పారు. హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు.
TTD ఆకస్మిక తనిఖీల యోచన
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో 33 అన్నప్రసాద కౌంటర్లలో టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తోందని అన్నారు. అదేవిధంగా భగవంతుని సన్నిధిలో ఉండే హోటళ్ల యజమానులు కూడా టీటీడీ తరహాలోనేు నాణ్యమైన ఆహార పదార్థాలు, తినుబండారాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
ఆరోగ్య & పారిశుద్ధ్య ప్రమాణాలు
హోటల్లో వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ వంటి ధ్రువీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా డిస్ప్లే చేయాలని, భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హోటల్ నిర్వహణ లైసెన్సును నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. అన్ని దుకాణాల్లో కూడా ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు సిలిండర్ ఏర్పాటు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులు నడిగి తెలుసుకోవాలని సూచించారు. హోటళ్ల లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, హోటల్లో యజమానులు సమష్టిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
పైలెట్ ప్రాజెక్ట్ – హోటళ్లలో నూతన విధానాలు
ప్రారంభంగా 5–10 హోటళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ నూతన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలను టీటీడీ సహకారంగా అందించనుంది.
Read also: Rain Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రకు 3 రోజులు వర్షాలు