గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను నలుగురు వ్యక్తుల స్వార్ధం కోసమే తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాలుగు గోడల చర్చించి ఇష్టానుసారంగా ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అందుకే ఆ దొరలను ఫామ్ హౌసుకి పంపారని వ్యాఖ్యానించారు. దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారని పొంగులేటి మండిపడ్డారు. త్వరలోనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి తెలిపారు.ఇది పేదోడి ప్రభుత్వమని ప్రజలు కోరుకున్నట్టే కాంగ్రెస్(Congress) పాలన ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇచ్చి 6 వేల మంది సర్వేయర్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు భూములను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబం, కోటరీ రూ.కోట్ల విలువైన భూములు కాజేసిందని కామెంట్ చేశారు.అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తల తాకట్టు పెట్టి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పేదల వైద్యం కోసం 400 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం 1375 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. దేశంలోనే తెలంగాణని రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
భూ భారతికి భయపడి దోపిడీదారులు పారిపోయారని, అందుకే రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా మందగించిందని ఆయన అన్నారు. గత పాలకులు దొరికిచోటల్లా అప్పులు చేశారని పొంగులేటి అన్నారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల(Indiramma’s house)ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయించామని తెలిపారు. పూర్తయిన ఇళ్లకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఈనెల 20 నుంచి 25 వరకు ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా బుగ్గారంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
Read Also: Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు