వేసవి ముగిసిపోయి వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో తెలంగాణలోని రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, పొలాల్లో పంటల సాగు పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.పంట వేయడం ప్రారంభించిన తర్వాత అది పెరిగిన దగ్గరి నుంచి చీడపీడలు పట్టకుండా ఉండేందుకు యూరియా వంటి రసాయనాలను రైతన్నలు పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ యూరియా(Urea) సమీకరణ సమస్యగా మారనుంది. కేంద్రం ప్రతినెలా నిర్ణీత కేటాయింపులు సరిగ్గా సరఫరా చేయడం లేదు. ఇప్పటికే ఏప్రిల్, మే నెలల కోటాలో భారీగా కోత విధించగా, ఈ నెలలోనూ అదే పరిస్థితి కనిపిస్తుండటంతో వ్యవసాయ శాఖ వర్గాల్లో ఆందోళన మొదలైంది.ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ(Department of Chemicals) కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ఆరంభానికి ముందే 5 లక్షల టన్నుల నిల్వ చేసి డిమాండుకు తగ్గట్లుగా మార్క్ఫెడ్ ద్వారా యూరియా పంపిణీకి ప్రణాళికలు చేసింది.
దిగుబడులపై ప్రభావం
ఏప్రిల్ నెలకు 1.70 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, కేంద్రం కేవలం 1.22 లక్షల టన్నులే పంపింది. మిగిలిన 48 వేల టన్నులు మే నెల కోటాలో భర్తీ చేస్తారన్న నమ్మకంతో అధికారులు ఎదురు చూశారు. కానీ మే నెలలోనూ 1.60 లక్షల టన్నుల కేటాయింపు ఉండాల్సి ఉండగా, కేవలం 94 వేల టన్నులే వచ్చాయి. అలా 66 వేల టన్నుల కోత విధించబడింది. ఏప్రిల్ నెలలో 48 వేల టన్నులు, మే నెలలో 66 వేల టన్నుల ఇలా రెండు నెలల కోటాలో 1.14 లక్షల టన్నులను కోత పెట్టారు. ఈ నేపథ్యంలో,రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంటలు ఎదిగే ముఖ్య దశలో నత్రజని ఎరువు లేకపోవడం, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయశాఖ
ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ, వెంటనే చర్యలు ప్రారంభించింది. మే 19న అదనపు సంచాలకుడు దిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సమావేశమయ్యారు. అలాగే మే 26న వ్యవసాయ శాఖ తరపున అధికారిక లేఖ పంపించారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హర్షవర్ధన్(Harsha Vardhan)కు లేఖ రాసి, తక్షణమే సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు.అయినా జూన్ నెలకు కేటాయించిన 1.70 లక్షల టన్నులలో, బుధవారం (జూన్ 5) వరకు రాష్ట్రానికి కేవలం 3 టన్నులే చేరాయి, మిగతా సరఫరా విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన మరింత తీవ్రమైంది.
Read Also: Amrabad Tiger Reserve: ఊరిని ఖాళీ చేసిన ఆదివాసీలు..విజయవంతమైన టైగర్ ప్రాజెక్టు