(TG) మేడారం జాతరకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ నాయకులు కూడా క్యూ కడుతున్నారు. అమ్మవార్లను దర్శించుకుని కోర్కెలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) గురువారం తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గిరిజన సంప్రదాయ వాయిద్యాల నడుమ మంత్రులు ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవతలకు ‘నిలువెత్తు బంగారం’ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ఓరం మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని, ఇది గిరిజన సమాజాలకు మహా కుంభమేళా లాంటిదని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Also: Phone Tapping : కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్

రూ. 890 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు
గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ధరతీ ఆబా గిరిజన గ్రామ వికాస్ అభియాన్’ కింద రూ. 1 లక్ష కోట్లు, ‘పీఎం జన్-మన్’ పథకం కింద రూ. 24,000 కోట్లు కేటాయించినట్లు ఓరం తెలిపారు. తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం ఇక్కడికి వస్తారని తెలిపారు. (TG) ఈ ప్రాంత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాయని వివరించారు. ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, బొగత జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ. 80 కోట్లు, రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ. 40 కోట్లు, ఈ ఏడాది జాతర ఏర్పాట్లకు రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ పేరుతో ములుగు జిల్లాలో రూ. 890 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భూమిని అప్పగించిందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: