తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలను నాంపల్లి లోని బోర్డు కార్యాలయం నుండి డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రదర్శన, ప్రత్యేకించి బాలికల ఉత్తమ ప్రతిభ, గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది విద్యారంగంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ https://results.cgg.gov.in/ లో చూడవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, మార్క్స్, గ్రేడ్ మరియు పాస్/ఫెయిల్ స్థితిని తెలుసుకోవచ్చు. ఫలితాలను ప్రింట్ తీసుకోవచ్చు లేదా PDF రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. రెండు సంవత్సరాలకు కలిపి సుమారు 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇది గత ఏడాదితో పోల్చితే కొద్దిగా పెరిగిన సంఖ్య.
Read also: Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం