Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ – వ్యయ నియంత్రణతో పాటు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి
తెలంగాణలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆర్థిక చర్యలు చేపట్టింది. 6 గ్యారంటీ పథకాల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, ఖజానాపై భారం తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం పన్నుల ఆధారిత వసూళ్లను పెంచడమే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని పెంచే వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది.విభిన్న ప్రభుత్వ శాఖల్లో నిధుల వినియోగంపై కఠిన ఆంక్షలు విధిస్తూ, అవసరమైన పనులకే నిధులు ఖర్చు చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా మైనింగ్ రాయల్టీలు, ఇసుక అమ్మకాలు, నిరుపయోగ భూముల విక్రయాలు, రాజీవ్ స్వగృహ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూముల విలువలను మళ్లీ సవరించి ఎక్కువగా లభించేలా చర్యలు చేపడుతోంది.ఆర్థిక శాఖ ఇప్పటికే పన్ను లీకేజీల నియంత్రణ, వ్యర్థ వ్యయాల అరికటనకు చర్యలు ప్రారంభించింది. పన్ను రహిత ఆదాయ వనరులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలపై అధిక భారం పడకుండా అదనపు ఆదాయం సమీకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

2024–25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్రానికి రూ.2,00,632 కోట్లు ఆదాయం లభించగా, మొత్తం వ్యయం రూ.1,97,066 కోట్లుగా నమోదైంది. ఇందులో రెవెన్యూ ఆదాయం రూ.1,36,136 కోట్లు కాగా, వస్తు సేవల పన్ను ద్వారా రూ.46,440 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,033 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.29,239 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.16,808 కోట్లు వసూలయ్యాయి. పన్నేతర ఆదాయం కింద రూ.6,071.98 కోట్లు సమకూరాయి.అదేవిధంగా ప్రభుత్వం మార్కెట్ రుణాలుగా రూ.64,456.79 కోట్లు తీసుకుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకే రూ.38,962.53 కోట్లు, వివిధ పథకాల కోసం రూ.73,455.82 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.24,078.06 కోట్లు, పెన్షన్లకు రూ.15,480.84 కోట్లు, సబ్సిడీలకు రూ.12,291.60 కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ఖర్చులను సమర్థంగా నియంత్రిస్తూ, ఆదాయ వనరుల పెంపు ద్వారా ఆర్థిక స్థిరత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది.
Read More : Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు