తెలంగాణలో డిగ్రీ విద్యాభ్యాసంలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంనుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం జరగిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో పలు అంశాలపై చర్చించి సంస్కరణల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షత వహించారు.
భారీ మార్పులు
డిగ్రీలో ఇప్పటివరకు సెమిస్టర్ ఎగ్జామ్స్కు 80 మార్కులు, ఇంటర్నల్కు 20 మార్కులు కేటాయించేవారు. యూజిసి(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కాలేజీల్లో మార్కుల కేటాయింపు 70:30గా మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్ ఎగ్జామ్స్ 50 మార్కులకే నిర్వహించనున్నారు. మిగిలిన 50 మార్కుల్లో ప్రాజెక్టు వర్క్/అసైన్మెంట్కు 25 మార్కులు, మిడ్టర్మ్ ఎగ్జామ్స్కు 25 మార్కులు కేటాయింపు చేయనున్నారు. అంటే కంటిన్యువస్ అసెస్మెంట్ ప్యాటర్న్-క్యాప్ సిస్టమ్ అమలు చేయబోతున్నారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సిలబస్, ఎగ్జామ్స్, ఎంట్రన్స్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
లెక్చరర్స్ డిజిటల్ వేదికల ద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు(ఎఫ్డీపీ) నిర్వహిస్తారు. టీశాట్తో అగ్రిమెంట్ కుదుర్చుకొని ట్రైనింగ్ ఇస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20 శాతం మార్పులతో డిగ్రీలో కొత్త పాఠ్యాంశాలు చేర్చబోతున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ తదితర భవిష్యత్తు డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఉండబోతుంది.అన్ని యూనివవర్సిటీలలో ఉమ్మడి విద్యా ప్రణాళిక అమలులో ఉంటుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏటా ఏప్రిల్ 30కి పూర్తిచేస్తారు. దీంతో వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదు.డిగ్రీలో కోర్సుల కన్వర్షన్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం అవకాశం ఇస్తారు. తెలంగాణలోని వివిధ వర్సిటీలలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అప్పగిస్తారు.
అలాగే దోస్త్లో భాగంగా డిగ్రీలో 4 విభాగాల నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ విధానం వల్ల కొన్ని సబ్జెక్టులను ఎక్కువ మంది, మరికొన్ని సబ్జెక్టులను అతి తక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయి పరిస్థితుల వల్ల ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడం కష్టంగా మారుతోందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమైంది. దీంతో ఆ విధానాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆ విధానంలో మార్పులను చేస్తారు. యూజీసీ స్వయంప్రతిపత్తి కాలేజీల్లో బకెట్ విధానం అమలు, పర్యవేక్షణకు విధి విధానాలు రూపొందిస్తారు.సమావేశంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య పురుషోత్తం, ఆచార్య ఎస్కే మహమూద్, ఉపకులపతులు అల్తాఫ్ హుస్సేన్(ఎంజీయూ), కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ప్రతాప్రెడ్డి(కాకతీయ), కుమార్(ఓయూ), ఉమేష్కుమార్(శాతవాహన), యాదగిరిరావు(తెలంగాణ వర్సిటీ) , జీఎన్ శ్రీనివాస్(పాలమూరు), సూర్య ధనుంజయ్( ఐలమ్మ) తదితరులు పాల్గొన్నారు.