తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ నుంచి అప్రమత్తత సూచనలు వచ్చాయి. నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశకు వంగి పయనిస్తుందన్నారు.మరోవైపు వాయవ్య బంగాళాఖాతం (Bay of Bengal) లో కొత్తగా ఏర్పడిన ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉందన్నారు. శనివారం ఏపీలోని ఉత్తరాంధ్ర తీరం, దాని పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తాజాగా వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనంలో విలీనమైందన్నారు.
జిల్లాల్లోనూ వర్షాలకు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.దక్షిణ జిల్లాలతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వీచే అవకాశం
ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు (Gusty winds) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను పాటించాలన్నారు.
Read Also: Godavari: కృష్ణా రిజర్వాయర్లకు జలకళ