తెలంగాణ లో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, నూతన తరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోంది.దీనిలో భాగంగా తాజాగా రాష్ట్రంలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(Telangana Public Schools)ను ప్రారంభించనుంది. తెలంగాణ విద్యా కమిషన్ సిఫారుల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నారు. రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జూన్, జులై నెలల్లో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్(Education Commission)ని నివేదిక అందించాల్సిందిగా కోరింది. దీనిలో భాగంగా విద్యాకమిషన్ సిఫారసుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ 4 స్కూళ్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. నర్సరీ నుంచి ఇంటర్ వరకూ విద్యను అందించడం కోసం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్), అలానే నర్సరీ నుంచి పదో తరగతి వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూళ్లు (టీఎఫ్ఎస్) ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదనలు పంపించింది. అలానే ప్రతి మండలానికి మూడు టీపీఎస్లు, నాలుగు టీఎఫ్ఎస్లు ఉండాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. అంతేకాక వీటిని ఈ 2025–26 విద్యాసంవత్సరం నుంచే మొదలు పెట్టాలని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.
ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు
ప్రభుత్వం ప్రారంభించబోయే తెలంగాణ స్కూళ్లో ఒక్కో దాంట్లో 1,500-1,800 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇక వీరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్నిపెంపొందించేలా మెనూ రూపొందించనున్నారు. ఈ స్కూళ్లు పేద, మధ్యతరగతి వారికి మెరుగైన విద్యను అందించడమే కాక వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.అంతేకాక ఈ స్కూళ్లో చదివే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం(Free travel facility) కల్పించనునన్నారు. ఇందుకోసం ప్రభుత్వం,ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు చేస్తోంది. అలానే ఈ పాఠశాల్లలో ఆధునిక డిజిటల్ క్లాస్రూమ్లు, విశాలమైన ఆట స్థలం, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
నర్సరీ నుంచి ఇంటర్ వరకూ
పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల మండలాల్లో అలానే నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు, పొల్కంపల్లి మండలాల్లో టీపీఎస్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి ముందుగా ఆరుట్లలో ఆ తర్వాత వచ్చేనెలలో మిగిలిన మూడు మండలాల్లో ఈ పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఆరుట్ల, వంగూరులో నర్సరీ నుంచి ఇంటర్ వరకూ మంచాల, పొల్కంపల్లి(Polkampally)లో నర్సరీ నుంచి పదో తరగతి వరకూ క్లాసులు కొనసాగించనున్నారు. ఒక్కో పాఠశాల కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
Read Also: RCB: ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్