రేట్ల నిర్ణయంపై పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు
తెలంగాణ బ్రాండ్ పేరుతో సన్న వడ్ల బియ్యాన్ని ప్యాక్ చేయించి ఓపెన్ మార్కెట్లో(Open Markets) విక్రయించ నున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అవసరాలకు మించి సన్న వడ్లు వస్తుండటంతో మిగులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని బియ్యంగా విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధం అవుతోంది. ఈ సన్నబియ్యంలో బీపీటీ, ఆర్ఎన్ఆర్(BPT,RNR), రకాలకు మంచి డిమాండ్ ఉండగా కేటగిరీలను పౌరసరఫరాల సంస్థ ప్రత్యేకంగా నిల్వ చేయించింది. భారీ ఎత్తున వానాకాలం, యాసంగి సీజన్లలో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వానాకాలంతో పోలిస్తే యాసంగి పంటలో నూకలు అధికంగా వస్తున్నాయి.
తెల్లకార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ
ఈ నేపథ్యంలో వానాకాలంలో వచ్చిన వడ్లతో బియ్యాన్ని తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. తెలంగాణ బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో సూపర్మార్కెట్లు, కిరాణా దుకాణాలతో పాటు రేషన్ షాపుల్లోనూ ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రేషనాపుల్లో ప్రస్తుతం తెల్లకార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అలాగే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
రేషన్ దుకాణాల్లో అందుబాటు
తెలంగాణ బ్రాండ్ బియ్యాన్ని ఏపీఎల్ కార్డుదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బ్రాండ్తో విక్రయించే బియ్యానికి ధర నిర్ణయించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్నబియ్యం ధరలను పరిశీలిస్తున్నారు. ధాన్యాన్ని ఎఫ్సీఐకి ఇస్తే డబ్బులు రావడానికి కనీసం ఆరు నెలలు నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది. అదే తెలంగాణ బ్రాండ్తో బియ్యాన్ని విక్రయిస్తే వెంటనే డబ్బులు వస్తాయని పౌరసరఫరా శాఖ భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి.
Read Also: CM Revanth : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్