బీఆర్ఎస్లో బహిరంగంగా అవిశ్వాస జ్వాలలు: కవిత మాటల్లో అసంతృప్తి విరుచుకుపడింది
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత గుంపుల రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పట్ల తన నిబద్ధతను స్పష్టంగా వ్యక్తం చేసిన ఆమె, కొన్ని వర్గాలు తనను అణచివేయాలనే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారాలను ఖండించిన కవిత, తాను చివరిసారి కాంగ్రెస్ నేతలతో మాట్లాడింది 2013లోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్రలు 101 శాతం జరుగుతున్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
కేటీఆర్పై పరోక్ష విమర్శలు.. నాయకత్వంపై నేరుగా ప్రశ్నలు
కేటీఆర్పై నేరుగా పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శలు చేసిన కవిత, “వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) చేయాల్సిన పని చేయకుండా ట్వీట్లకే పరిమితమైతే ఎలా?” అని ప్రశ్నించారు. పార్టీని నడిపే సామర్థ్యం లేనివారు తనకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తన లేఖపై విమర్శలు వస్తున్నాయని, కానీ గతంలో వందల లేఖలు రాసినప్పుడు కేసీఆర్ వాటిని చదివి చించివేశారని గుర్తు చేశారు. “ఈసారి లేఖ బయటికి ఎలా వచ్చింది?” అంటూ ఆమె ప్రశ్నించారు. పార్టీ ఒక సభ్యునికి నోటీసులు ఇచ్చినప్పుడు హడావుడి, మరొకరికి ఇచ్చినప్పుడు సైలెన్స్ ఎందుకని ఆమె నిలదీశారు. గతంలో మద్యం కుంభకోణం విషయంలో వచ్చిన ఆరోపణలపై తాను రాజీనామా చేయాలనుకున్నప్పటికీ కేసీఆర్ ఆపినారని ఆమె తెలిపారు.
“నన్ను అణగదొక్కాలనుకుంటున్నారు”.. కవిత భావోద్వేగం
తాను పార్టీకి అండగా ఉన్నప్పటికీ కొందరు తనను దూరం పెట్టాలని చూస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కేసీఆర్ లాగే “తిక్కదాన్ని” అని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. తన ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతర్గత విషయాలపై తాను రాసిన లేఖను ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. పార్టీ చేయాల్సిన పనుల్లో సగం తానే చేస్తున్నానని, కడుపులో బిడ్డను పెట్టుకుని ఊరూరా తిరిగానని ఆమె అన్నారు.
పార్టీ ఫోరంపై నమ్మకం లేదన్న సంకేతాలు
“పార్టీ ఫోరంలో మాట్లాడండి” అన్న వ్యాఖ్యలపై స్పందించిన కవిత, “అక్కడ ఎవరున్నారు? ఎందుకైనా బయటే మాట్లాడాలి” అంటూ స్పష్టం చేశారు. తాను వెన్నుపోటు రాజకీయాలు చేయలేనని, ముందు ఒకటి, వెనుక మరోటి మాట్లాడే వారిలో తాను కాదని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభను విజయవంతమైందని చెప్పుకునే వారిపై ఆమె ఎద్దేవా చేశారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. “లీకు వీరులను బయటపెట్టమంటే, గ్రీకు వీరుల్లా నాపై విరుచుకుపడుతున్నారు” అని కవిత వ్యాఖ్యానించారు.
కేసీఆర్తో భేటీపై గుట్టు.. కొత్త పార్టీ అవసరం లేదన్న అభిప్రాయం
తాను కేసీఆర్ను ఎప్పుడు కలిసేది చెప్పనని, దానికి ఎలాంటి డెడ్లైన్ లేదని కవిత తెలిపారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే చాలని సూచించారు. కొందరు తామే కేసీఆర్ను నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఆయనను నడిపించే వారు ఉన్నారా అని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని కవిత వ్యాఖ్యానించారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలోనూ పని చేసేది లేదని స్పష్టం చేశారు.
Read Also: Kavitha: కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు: కవిత