హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన మౌలిక డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లకు రాష్ట్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో మెట్రో విస్తరణకు అవకాశం ఏర్పడింది.హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ (HAML) ఇప్పటికే మెట్రో రెండో దశ బి-భాగంలో భాగంగా మూడు ప్రధాన మార్గాలకు విడివిడిగా డీపీఆర్లు రూపొందించింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ వివరాలను పంపాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
శంషాబాద్ విమానాశ్రయం
మెట్రో రెండో దశ బి-భాగంలోని మూడు మార్గాలు కలిపి 86.1 కిలో మీటర్ల పొడవున 2030 నాటికి పూర్తయితే, ప్రతిరోజూ 6.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని డీపీఆర్లో పేర్కొన్నారు.కారిడార్-9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు.శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాన్సాన్పల్లి రోడ్, ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి వెంట పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్ వరకు మెట్రో మార్గం వెళ్తుంది.రావిర్యాల నుంచి ప్యూచర్సిటీ(Future City) వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 17.1 కిలో మీటర్లు ఉంటుంది.ఈ మార్గంలో ఆర్జీఐఏ, పెద్ద గోల్కొండ, బహదూర్గూడ, తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లను ప్రతిపాదించారు.
అంచనా వేశారు
ఎయిర్పోర్టు-ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ లైన్ పూర్తి చేయడానికి రూ.7,168 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో 2029 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.98 లక్షలు ఉంటుందని, 2055 నాటికి 6.03 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు.కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలో మీటర్లు ప్రతిపాదించారు. ఈ మార్గంలో 18 స్టేషన్లు రానున్నాయి.జేబీఎస్ న్యూ, డైమండ్ పాయింట్, బాపూజీనగర్, ఓల్డ్ బోయిన్పల్లి, బోయిన్పల్లి చెక్పోస్టు, డెయిరీ ఫాం, సుచిత్ర జంక్షన్ రానున్నాయి.అలాగే పైప్లైన్ రోడ్, అంగడిపేట్, దూలపల్లి ఎక్స్రోడ్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, ఈఎంఆర్ఐ, కండ్లకోయ, ఓఆర్ఆర్ మేడ్చల్, మేడ్చల్ చెక్పోస్ట్, మేడ్చల్లో ముఖ్యమైన స్టేషన్లు వచ్చే అవకాశముంది.జేబీఎస్-మేడ్చల్ మెట్రో రైల్ లైన్ పూర్తి చేయడానికి ఖర్చును రూ.6,946 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం పూర్తైతే 2030 నాటికి నిత్యం 2.54 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఈ సంఖ్య 5.70 లక్షలకు చేరే అవకాశముందన్నారు.
మెట్రో రైల్
కారిడార్ 11లో జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22 కిలో మీటర్ల మార్గంలో 14 స్టేషన్లు వస్తాయి.జేబీఎస్ న్యూ, విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి ఎక్స్రోడ్, లాల్బజార్, లోతుకుంట, అల్వాల్ మార్గాలు రానున్నాయి.అలాగే రాష్ట్రపతి నిలయం కూడలి, బొల్లారం, హకీంపేట, దేవరయాంజాల్, తూంకుంట, ఓఆర్ఆర్ శామీర్పేట(ORR Shamirpet), శామీర్పేట ప్రాంతాల్లో స్టేషన్లు వస్తాయి.జేబీఎస్-శామీర్పేట మెట్రో రైల్ లైన్ వ్యయం రూ.5,465 కోట్లుగా అంచనా వేశారు. 2030 నాటికి నిత్యం ఈ మార్గంలో 1.92 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఆ సంఖ్య 3.74 లక్షలకు పెరుగుతారని డీపీఆర్లో పేర్కొన్నారు.
అనుమతి
మెట్రో 1, 2, 3 కారిడార్లు కలిపి 69.2 కిలో మీటర్లు ఇప్పటికే పూర్తై సేవలందిస్తోంది. ఇప్పటికే మెట్రో 2-Aలో భాగంగా 4, 5, 6, 7, 8 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మెట్రో రైల్ లైన్(Metro rail lineను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని అనుమతి కోసం కేంద్రానికి 2024 నవంబరులోనే పంపించారు. తాజాగా మెట్రో రెండో దశ బి-భాగానికి సంబంధించిన డీపీఆర్ను కేంద్రానికి పంపేందుకు సర్వం సిద్ధం చేశారు.
Read Also: Revanth Reddy: పాత నేతలతో కాంగ్రెస్ కు తలనొప్పి..రేవంత్తో మీనాక్షి భేటీ