తెలంగాణ ప్రభుత్వం భారీ నిర్ణయం: ఉచిత క్యాన్సర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణలో మరో కీలకమైన అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముందస్తు గుర్తింపు ద్వారా ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజా మార్గదర్శకాలను ఖరారు చేస్తూ, గ్రామ స్థాయిలోనే ఈ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు, పురుషుల్లో నోటి క్యాన్సర్ను గుర్తించేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్లు నిర్వహించనున్నారు.
ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణ
సర్వేల్లో స్పష్టమైన విషయం ఏంటంటే, చాలా క్యాన్సర్ కేసులు ముదిరిన దశలోనే బయటపడుతున్నాయి. అప్పటికి చికిత్స చేపట్టినా, రోగిని పూర్తిగా రికవర్ చేయడం చాలా కష్టం అవుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించే చికిత్సల్లో క్యాన్సర్ కేసుల శాతం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ను ఆరంభ దశలోనే గుర్తించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను తీసుకువెళ్లాలని భావించింది. ముందస్తుగా క్యాన్సర్ను గుర్తిస్తే, తక్కువ ఖర్చుతో, ఎక్కువ విజయవంతంగా చికిత్స చేయవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
ప్రత్యేక క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు
క్యాన్సర్ పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రూ.50 కోట్ల చొప్పున ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రెండవ దశలో మరో ఐదు ప్రాంతీయ కేంద్రాలు రావనున్నాయి. ఈ కేంద్రాల్లో మెడికల్, సర్జికల్, రేడియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక, అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలను కూడా ప్రారంభించనున్నారు. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలూ అందుబాటులోకి రానున్నాయి.
మొబైల్ వాహనాల ద్వారా గ్రామస్థాయి స్క్రీనింగ్
ప్రత్యేక మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామాన్ని సందర్శించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో వాహనంలో ఆంకాలజిస్టులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. వీరు రోజుకు కనీసం 200 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముందుగా నిర్ణయించిన గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ తేదీలను ప్రకటించి, స్థానిక ప్రజలకు ముందస్తుగా సమాచారం అందిస్తారు. పరీక్షల్లో ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే, జిల్లా స్థాయి క్యాన్సర్ కేంద్రానికి తరలించి అవసరమైతే సర్జరీలు నిర్వహించనున్నారు. తీవ్రమైన కేసుల్లో హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.
ఉచిత స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య తెలంగాణ దిశగా
ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, విద్యార్థులు, అధ్యాపకులు మరియు స్థానిక ప్రజలకు ఉచిత స్క్రీనింగ్ నిర్వహించే అవకాశం లభించనుంది. దీని ద్వారా తెలంగాణలో క్యాన్సర్ మరణాల శాతం గణనీయంగా తగ్గించే లక్ష్యాన్ని ప్రభుత్వం ఉద్దేశించింది. ప్రభుత్వం త్వరలోనే పూర్తి షెడ్యూల్, తేదీలు ప్రకటించనుంది.
READ ALSO: KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు : కేటీఆర్