తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. రహదారి భద్రతను పెంచడం, ప్రజల ప్రాణాలను కాపాడడం, రవాణా నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుంటోంది.2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదిక (Pragathi Report) లో వెల్లడించింది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతి వేగం, మాదకద్రవ్యాలు సేవించి వాహనం నడపడం వంటి తీవ్ర ఉల్లంఘనలు ఈ సస్పెన్షన్లకు ప్రధాన కారణాలుగా అధికారులు వెల్లడించారు.ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.ఇక ఇతర రాష్ట్రాల మాదిరిగా వాహన రిజిస్ట్రేషన్, ఇతర సేవలను సులభతరం చేయడానికి ‘వాహన్’ అప్లికేషన్ను అమలు చేయనున్నట్లు చెప్పారు.
మినహాయింపులు లభించినట్లు నివేదికలో వెల్లడించారు
ఈ డిజిటల్ సేవలు ఆగస్టు చివరినాటికి ప్రారంభం కానున్నాయి. ఇది పౌరులకు రవాణా శాఖ సేవలను వేగంగా, సులువుగా పొందేందుకు వీలు కల్పిస్తుందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈవీ పాలసీ కింద పరిమితి లేకుండా 100 శాతం రోడ్ ట్యాక్స్ (Road Tax), రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను అందిస్తోందన్నారు. 2024 నవంబరు 16 నుంచి 2025 జూన్ 30 వరకు 49,633 ఈవీలకు రూ.369.27 కోట్ల మేర మినహాయింపులు లభించినట్లు నివేదికలో వెల్లడించారు. తెలంగాణ వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ ‘టీఎస్’ను 2024 మార్చి 15 నుంచి ‘టీజీ’గా మార్చినట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్తో మార్చబడ్డాయన్నారు.

జారీ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందన్నారు
డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా పరీక్షించేందుకు 25 ద్విచక్ర వాహనాల ట్రాక్లు, 27 ఫోర్వీలర్, 5 భారీ వాహనాల ట్రాక్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లుగా మార్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇది డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందన్నారు. వాహన ఉద్గారాలను పర్యవేక్షించడానికి కాలుష్య టెస్టింగ్ సెంటర్ల (Pollution testing centers) ను కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇది వాహన కాలుష్యాన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి సహాయపడుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com