ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్‌ పర్యటన

Read Time:  1 min
cm revanth sgp
cm revanth sgp
FONT SIZE
GET APP

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఆదివారం ముగిసిన ఈ పర్యటనలో సింగపూర్‌ వ్యాపార సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపి, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేపట్టింది.

సింగపూర్ పర్యటన చివరిరోజున సీఎం రేవంత్‌రెడ్డి బృందం సింగపూర్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ (ఎస్‌బీఎఫ్‌) ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపింది. ఇండియన్‌ ఓషన్‌ గ్రూప్‌ ఫౌండర్‌, సీఈవో ప్రదీప్త్‌ బిశ్వాస్‌తో పాటు డీబీఎస్‌ కంట్రీ హెడ్‌ లిమ్‌హిమ్‌న్‌తో కూడా సమావేశమైంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ప్రక్రియ, ఆర్థిక అవకాశాలను వివరించింది.

పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, ప్రీమియం ఐటీ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రాధాన్యాన్ని సింగపూర్ వ్యాపారవర్గాలకు తెలియజేయడం జరిగింది. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌లో తెలంగాణకు ఉన్న ప్రత్యేకతలను, ఆర్థిక సమర్థతను ప్రతినిధి బృందం వివరించడంతో వ్యాపార సంస్థలు ఆసక్తి చూపాయి.

సింగపూర్‌ పర్యటన ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌ బయల్దేరింది. సోమవారం నుంచి అక్కడ నాలుగు రోజులపాటు జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఈ సదస్సు ద్వారా కూడా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరగనున్నాయి.

ఈ పర్యటన తెలంగాణకు పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి తేవడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.