తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అనేక సంస్కరణలను ప్రకటించారు. ఈ సమీక్షలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంటర్మీడియట్ విద్య నాణ్యత మెరుగుదల, కొత్త పోస్టుల మంజూరు వంటి అంశాలపై చర్చ జరిగింది.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు
తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రకటించారు. ఇప్పటికే తొలి విడత పాఠశాలల కోసం స్థల సేకరణ పూర్తయిందని, ఇకపై రెండో విడత పాఠశాలల నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు హైదరాబాద్ మినహా 105 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను (Integrated school) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించగా, ఇప్పుడు నియోజకవర్గానికి రెండు పాఠశాలలు నిర్మించాలని సీఎం వెల్లడించడం గమనార్హం.
ఈ సమీక్ష సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల భవనాల నమూనాలను, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం భవనం నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించి కొన్ని మార్పులు సూచించారు. ప్రతి యంగ్ ఇండియా పాఠశాలలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. స్కూళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల పురోగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని, త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ విద్యపై దృష్టి
పదో తరగతిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నప్పటికీ, ఇంటర్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్ పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుందో కారణాలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ కీలకమైందని, ఈ సమయంలో వారికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చూడాలని, చేరికలతో పాటు వారి హాజరుపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటర్ విద్య మెరుగుదల కోసం అన్ని దశల్లో చర్చించి శాసనసభలోనూ చర్చ పెడదామని ఆయన అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విద్య పాఠశాలల్లోనే అందుతోందని, అందుకే అక్కడ డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ క్రమంలో 12వ తరగతి వరకు పాఠశాలలున్న రాష్ట్రాలు, ఇంటర్మీడియట్ వేరుగా ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
కొత్త పోస్టుల మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2023 వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 273 బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు (teaching and non-teaching posts) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దీనిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దానికితోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు (IFP), JEE, NEET, EAMCET వంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించినట్లు ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
Read also: TG Degree: తెలంగాణ డిగ్రీ కళాశాలలో ‘నాన్లోకల్స్’కు చదివే అవకాశం