తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ అంశం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటిని కూల్చొద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా తన ఇంటికి నష్టమే కాకుండా, పర్యావరణానికి ప్రమాదమని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

రోడ్డు విస్తరణపై చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద ఆయన నివాసం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేపట్టారు. దీనివల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ప్రభావం పడనుంది.
చంద్రశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తూ –
మహారాజ్ అగ్రసేన్ నుంచి రోడ్ నంబర్ 45లో రోడ్డు విస్తరణకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారుతాను 25 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నానని, ఇప్పుడు ఖాళీ చేయడం అన్యాయమని అన్నారు. గతంలో వంద అడుగుల రోడ్డు విస్తరణ చేసినప్పుడే పార్క్ గోడను మించకుండా రోడ్డు నిర్మాణం చేశారు అని గుర్తు చేశారు. ఇప్పుడు అదే గోడను మరోసారి విస్తరించడమేంటని ప్రశ్నించారు. కొత్త రోడ్డు విస్తరణ వల్ల పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని వాదించారు.
కేబీఆర్ పార్క్ విస్తరణపై కాలనీవాసుల వ్యతిరేకత
కేవలం చంద్రశేఖర్ రెడ్డే కాదు, రోడ్ నంబర్ 92లో నివాసముండే ప్రజలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రహదారి విస్తరణ వల్ల 306 ఇండ్లు, వ్యాపార సముదాయాలు దెబ్బతింటాయి. GHMC, తెలంగాణ ప్రభుత్వంపై పిటిషన్ వేసి, తమ ఇళ్లను కూల్చొద్దని కోరారు. తమ నివాసాలకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళన కలిగిస్తున్నారని వాపోయారు. ఇప్పటికే హైకోర్టు GHMC కమిషనర్కు నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రణాళికను సమీక్షించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రహదారుల నిర్మాణంపై గతంలో కూడా వివాదాలు చెలరేగాయి. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో కొన్ని ప్రాజెక్టులు రద్దు అయ్యాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ట్రాఫిక్ తగ్గింపు దృష్టితో ముందుకు సాగుతోంది.
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన వ్యక్తిగత పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. GHMC కు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. కాలనీవాసులు, వ్యాపారస్తుల వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోనుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించేలా నిర్ణయం వస్తుందా? అనేది చర్చనీయాంశం. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ కీలక అంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళిక, మరోవైపు ప్రజల ప్రాణాలు, ఆస్తులపై ఉన్న భయం. ఈ వివాదం త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. హైకోర్టు తీర్పు, GHMC తుది ప్రణాళికకు అందరి దృష్టి ఉంది.