పద్ధతి మార్చుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్

Read Time:  1 min
kishan reddy warning
kishan reddy warning
FONT SIZE
GET APP

మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం చేపట్టింది. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ తో పాటు బిజెపి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని సడెన్ గా ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళమని చెప్పడం..ఇల్లు కూల్చేస్తాం అంటే ఎలా అని వారంతా ప్రశ్నించారు. అయితే సియోల్‌ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

రేవంత్‌ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పటి వరకు ప్రజలకు, అధికారులకు ఎవరికీ తెలియదని, కానీ సర్కార్ మాత్రం అడ్డుగోలుగా నిరుపేదల ఇండ్లను కూల్చుతోందని ఘాటు విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రెడ్డి ప్రశ్నించారు.

మూసీపై తాము నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించినట్లు గుర్తుచేశారు. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు బుల్డోజర్ తో ఇల్లు కూలుస్తారో అనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బస్తీ నిద్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఇండ్లు కూల్చాలన్నది ఏమాత్రం న్యాయం కాదని, రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.