కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన

Read Time:  1 min
revanth reddy
revanth reddy
FONT SIZE
GET APP

పేదలకు ఆరోగ్య సేవలను అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ అసుపత్రి ద్వారా పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
గోషామహల్ పోలీస్ స్టేడియం స్థలంలో ఈ ఆసుపత్రి నిర్మితం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛొంగ్తు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

గోషామహల్‌ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని, ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.