హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వట ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయు) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు దృష్టి సారించింది. ఇరు వాదనలను విన్న న్యాయస్థానం రేపటి వరకు ఈ భూముల్లో ఏ విధమైన నిర్మాణ అభివృద్ధి పనులను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.ఈ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలనే డిమాండ్తో పిల్ దాఖలైంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం లోతుగా వాదనలు విన్నది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిశంకర్ వాదనలు వినిపించారు.గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకురావడంతో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి కేటాయించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదైనా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంచ గచ్చిబౌలి భూముల్లో పెద్ద ఎత్తున చెట్లను నరికి, భూమిని చదును చేయడం జరుగుతోందని న్యాయస్థానానికి వివరించారు.కంచ గచ్చిబౌలి పరిసరాల్లో మూడు చెరువులు, పలు బండ రాళ్లు, అరుదైన జంతువులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వం ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించలేదని, ఈ ప్రాంతాన్ని అటవీ భూమిగా ప్రకటించాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించినా, ఒప్పంద నిబంధనల ప్రకారం ఉపయోగించలేదని అన్నారు.
దీంతో ఆ తర్వాత ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసిందని వివరించారు.ఇంకా ఈ భూమి అటవీ భూమిగా ఎప్పుడూ ప్రకటించలేదని, పిటిషనర్లు పేర్కొన్నట్లు దానిని అటవీ భూమిగా ప్రకటించడం సబబుకాదని తెలిపారు. “హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో చెట్లు, పాములు, నెమళ్లు ఉన్నాయి. ఆ లెక్కన అన్నీ అటవీ భూములేనా?” అని ప్రశ్నించారు. ఈ లెక్కన నగరంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకూడదా? అని వాదించారు.కోర్టు విచారణలో భాగంగా, ఇప్పటి వరకు ఈ భూమిని అటవీ భూమిగా పేర్కొన్న సందర్భం లేదని, అందువల్ల దీనిపై మరింత స్పష్టత అవసరమని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే వారంలో జరగనుంది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ వాదనలు మరింత బలంగా వినిపించాల్సి ఉంటుంది.