తెలంగాణ రాజకీయ రంగంలో అనూహ్యంగా వేడి రాజేస్తోంది. “స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి” అన్న ఫార్ములాను ఇప్పుడు బీజేపీ పూర్తిగా అమలు చేస్తోంది. రాజకీయాల్లో విజయాన్ని సాధించాలంటే సరైన వ్యూహం, ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. ఇప్పటి వరకూ ప్రధానంగా వ్యతిరేక పార్టీలపై విమర్శలకే పరిమితమైన బీజేపీ, ఇప్పుడు అధికార లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ధ్యేయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూ, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
కేంద్రం అభివృద్ధిపై ఫోకస్.. రాష్ట్రంపై ఆరోపణల వెల్లువ
బీజేపీ రూపొందించిన రోడ్మ్యాప్ ప్రకారం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో కృషి చేస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఒకవైపు నిధుల విడుదల, ప్రాజెక్టుల ఆమోదం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై సహకారమే లేదని ఆరోపణలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు వచ్చిన సందర్భం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కావడం, ప్రాజెక్టులపై చర్చ జరగడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.

గడ్కరీ భేటీకి వెనుకరాజకీయ లెక్కలు
బేగంపేట ఎయిర్పోర్టులో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి – నితిన్ గడ్కరీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR), రేడియల్ రోడ్లు, NH765 ప్రాజెక్టులు, మరియు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి అంశాలు ప్రాధాన్యత పొందాయి. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన ఉత్తర RRR కోసం త్వరితగతిన ఫైనాన్షియల్ క్లియరెన్స్, కేబినెట్ ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై “మాకు సహకారం లేదు” అంటూ కేంద్రం ఆరోపణలు ముద్రిస్తోంది.
వెనుకటినుంచి కొనసాగుతున్న ఆరోపణలు – బీజేపీ టార్గెట్ స్పష్టమే!
ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గతంలో అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి GHMC సహకరించడం లేదంటూ విమర్శలు చేశారు. తాజాగా అదే అంబర్పేట్ సభలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో గడ్కరీ బహిరంగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం చూపిస్తున్న ఆసక్తిని వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం లేదన్న మాటను మళ్లీ మళ్లీ ప్రజల చెవుల్లో వేయాలని ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ అసలు చిత్రం మొదలైందా..?
నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు — “ఇది అభివృద్ధిలో ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ముందు ఉంది” అన్నది బీజేపీ దృష్టిని పూర్తిగా తెలంగాణపై పెట్టిందనే స్పష్టతనిస్తుంది. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే రూ. 3900 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం, NH-363ను జాతికి అంకితం చేయడం ఓ ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ కాంగ్రెస్పై విమర్శలు, అప్పట్లో BRSపై విమర్శలు.. ఇలా బీజేపీ వ్యూహాత్మకంగా ప్రతి పార్టీపై దాడి చేస్తూ తమకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవాలనుకుంటోంది.
Read also: Revanthreddy: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు