ఇండియా అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’ తో భర్తీ చేయాలన్న పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2020లో సుప్రీం కోర్టు ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు, కేంద్రం సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు తీర్పు
2020లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. పేరు మార్పు కోసం అనేక అభ్యర్థనలు వచ్చినా ప్రభుత్వాలు విస్మరించాయని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే పాటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ విషయంపై పిటిషనర్ తమ పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి జస్టిస్ సచిన్ దత్తా కూడా అనుమతి ఇచ్చారు.
పిటిషనర్ వాదనలు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదనే పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఇండియా అనే పేరు వలస వారసత్వం అని, ఇది దేశ నాగరికత నైతికతను పూర్తిగా సూచించదని, అయితే భారత్ దాని సాంస్కృతిక, చారిత్రక గుర్తింపులో లోతుగా పాతుకుపోయిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సందర్భంగా, దేశాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’గా పేరు మార్చడంపై విస్తృతమైన చర్చలు జరిగాయని పిటిషనర్ హైలైట్ చేశారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు
2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రంపాటించేలా చూడాలని విన్నవించుకున్నారు. పిటిషన్ నమహా తరఫు సీనియర్ న్యాయవాది సంజీవ్ సాగర్ వాదలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు,ఇండియా స్థానంలో భారత్ లేదా హిందూస్థాన్ అని పెట్టాల్సిందిగా సుప్రీం తీర్పును అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రజల అభిప్రాయాలు
ఈ పేరు మార్పు వివాదం సామాన్య ప్రజానికాన్ని కూడా ఆకర్షిస్తోంది. కొంతమంది ఇండియా అనే పేరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని, దాన్ని మార్చడం అవసరం లేదని చెబుతుండగా, మరికొందరు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘భారత్’ అనే పేరే ఉపయోగించాలంటున్నారు.హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ అంటే సాధారణ విషయం కాదు, ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి. దీంతో ఈ వివాదం ఇంకా కొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.