సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకునే వీటో అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమం అని పేర్కొన్న కోర్టు ఆయన వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని కోర్టు పేర్కొన్నది.రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు ఎటువంటి విచక్షణాధికారాలు లేవని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తీర్పును రిజర్వ్
రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం సహా అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై ఇంతకుముందు విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గవర్నర్ బిల్లులను పెండింగ్లో ఉంచకూడదని పేర్కొంటూ కీలక తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేయకపోతే గరిష్టంగా మూడు నెలల వ్యవధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి 2020 నుంచి 10 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారు. ఈ వ్యవహారంలో గవర్నర్కు, స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
స్టాలిన్ హర్షం
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ పెండింగ్లో ఉంచడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల విజయంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత, 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

2020 నుంచి 2023 వరకు సుమారు 12 బిల్లలను తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ అనుమతి కోసం పంపింది. కానీ గవర్నర్ ఆ బిల్లులను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఆ బిల్లుల అనుమతి కోరుతూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే 2023 నవంబర్లో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, మరో 10 బిల్లులు గవర్నర్ వద్దే ఉండిపోయాయి. అయితే కొన్ని రోజుల వ్యవధిల్లో మళ్లీ ఆ పది బిల్లులను రాష్ట్ర శాసనసభలో పాస్ చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతున్నట్లు తమిళనాడు సర్కారు తన పిటీషన్లో సుప్రీంకు తెలిపింది.
Read Also:VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి