శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు:- ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాల్లోని శ్రీ చైతన్య కళాశాలల శాఖలపై ఏకకాలంలో జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు అనుమానంతో ఐటీ అధికారులు ఈ దాడులను చేపట్టారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో భారీగా ఫీజులు వసూలు చేసి, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాల ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కార్పొరేట్ లావాదేవీలు, విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ, ఫీజుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 20 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొని, గతంలో సంస్థ ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్ను విశ్లేషిస్తున్నారు. ఈ సోదాలు ఒక రోజు కాకుండా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.
ఐటీ శాఖ అనుమానిస్తున్న అంశాల్లో ముఖ్యమైనది – విద్యార్థుల నుంచి ఫీజులు నగదు రూపంలో వసూలు చేయడమే. అధికారికంగా ఆన్లైన్ పద్ధతిలో ఫీజులు స్వీకరించాల్సిన సంస్థ, నగదు రూపంలో తీసుకొని పన్ను ఎగవేయడానికి మరో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ చైతన్య కళాశాలల్లో విద్యార్థుల నుంచి డబ్బు నగదు రూపంలోనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నగదు రూపంలో వసూలు చేసిన ఫీజులను ఐటీ రిటర్న్స్లో చూపించకుండా, పన్ను ఎగవేయడం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి ఏడాది వేలాది విద్యార్థుల నుంచి ఫీజులు, పరీక్ష ఫీజులు, అడ్మిషన్ ఫీజుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, దీనివల్ల పన్ను ఎగవేతకు అవకాశం ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు. సంస్థపై అందిన సమాచారం ప్రకారం, కొన్ని అకౌంటింగ్ లెక్కలు కుదిర్చేందుకు ఇన్వాయిసులను సరిగ్గా నమోదు చేయకుండా ఉండటాన్ని కూడా దర్యాప్తులో గుర్తించారు.ప్రస్తుత దర్యాప్తులో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సంస్థ ప్రధాన నిర్వాహకులను విచారించే అవకాశముంది. అలాగే, సంస్థ లావాదేవీలు నిర్వహించిన ప్రైవేట్ అకౌంట్స్ను, సంస్థకు సంబంధించిన కీలక బజినెస్ అకౌంటింగ్ వివరాలను విశ్లేషిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు ఈ తనిఖీల ద్వారా సంస్థ ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగవేశారనే విషయాన్ని తేల్చనున్నారు. మరోవైపు, ఈ తనిఖీలు కొనసాగుతుండటంతో విద్యాసంస్థల యాజమాన్యం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
విద్యా రంగంలో భారీ స్థాయిలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఐటీ శాఖ తీవ్రంగా స్పందిస్తోంది. విద్యాసంస్థలు విద్యార్థుల ఫీజుల రూపంలో డబ్బును నగదుగా వసూలు చేసి, వాటిని తప్పుడు లెక్కల ద్వారా దాచిపెడతాయని, దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం జరుగుతోందని భావిస్తున్నారు.
శ్రీ చైతన్య సంస్థలపై ఈ తనిఖీలు పూర్తయిన తరువాత, మరిన్ని సంస్థలపై కూడా దర్యాప్తు జరిగే అవకాశముంది.ఈ తనిఖీలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. సంస్థ అక్రమ లావాదేవీల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం పడుతుందోనన్న సందేహం ఏర్పడుతోంది. ఏదేమైనా, ఐటీ శాఖ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది.