ఐపీఎల్ 2025లో భాగంగా,వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంతితో పాటు బ్యాట్తోనూ సమిష్టిగా రాణించిన సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదుచేసింది. చెపాక్లో చెన్నైపై సన్రైజర్స్కు ఇది తొలి విజయం కావడం విశేషం. లో స్కోరింగ్ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల ఛేదనను ఆ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు) రాణించారు.మొదట హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై.. 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ (4/28), పాట్ కమిన్స్ (2/21), జయదేవ్ ఉనద్కత్ (2/21) ఆతిథ్య జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఈ సీజన్లో చెన్నైకి తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42, 1 ఫోర్, 4 సిక్సర్లు), అయుశ్ మాత్రె (19 బంతుల్లో 30, 6 ఫోర్లు) సీఎస్కేను ఆదుకున్నారు. ఈ సీజన్లో చెన్నైకి ఇది ఆడిన 9 మ్యాచ్లకు గాను ఏడో ఓటమి. ఈ ఫలితంతో ప్లేఆఫ్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించినట్టే.
వ్యక్తిగత స్కోరు
స్వల్ప ఛేదనలో హైదరాబాద్ ఇన్నింగ్స్ కూడా చెన్నై మాదిరిగానే సాగింది. ఖలీల్ రెండో బంతికే ప్రమాదకర అభిషేక్ శర్మను ఔట్ చేసి సీఎస్కేకు తొలి బ్రేకిచ్చాడు. నాలుగు బౌండరీలతో కుదురుకున్నట్టే కనిపించిన ఇంప్యాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (19) అన్షుల్ ఆరో ఓవర్లో క్లీన్బౌల్డ్ అయి మళ్లీ నిరాశపరిచాడు. నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన క్లాసెన్ (7)ను జడ్డూ బోల్తా కొట్టించాడు. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ సెంచరీ తర్వాత వరుసగా విఫలమైన ఇషాన్ చెన్నైతో పోరులో మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. రెండో వికెట్కు హెడ్తో 37 పరుగులు, మూడో వికెట్కు అనికేత్తో 36 రన్స్ జత చేసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన శైలికి భిన్నంగా ఆడిన ఇషాన్ అర్ధశతకానికి సమీపిస్తున్న క్రమంలో నూర్ అహ్మద్ వరుస ఓవర్లలో ఎస్ఆర్హెచ్కు రెండు షాకులిచ్చాడు. 12వ ఓవర్లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ను ఔట్ చేసిన అతడు మరుసటి ఓవర్లో అనికేత్నూ పెవిలియన్కు పంపి చెన్నైలో గెలుపు ఆశలు రేపాడు. కానీ మెండిస్, నితీశ్ రెడ్డి (19 నాటౌట్) ఎక్కడా తావివ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు.
కండిషన్స్
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ ఇదో గొప్ప విజయం. ఈ రాత్రి మాకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు సమష్టిగా రాణించారు. టాపార్డర్ బ్యాటర్లే మ్యాచ్ను ముగించాలనుకున్నారు. కానీ కండిషన్స్కు తగ్గట్లు డిఫెన్సివ్గా ఆడి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాం.నితీష్ కుమార్ రెడ్డికి ఫినిషర్ రోల్ ఇచ్చాం.ఈ మ్యాచ్ను మరింత సౌకర్యంగా ముగించాలనుకున్నాం. మొత్తానికి ఈ విజయంతో సంతోషంగా ఉన్నాం.’అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
Read Also: Dhoni: సీఎస్కే ఓటమి పై స్పందించిన ధోని