IPL 2025: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం:రజత్ పటీదార్

Read Time:  1 min
IPL 2025: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం:రజత్ పటీదార్
FONT SIZE
GET APP

ఐపీఎల్ 2025లో భాగంగా,  గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో హోరాహోరీగా జరిగిన హైస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో బెంగళూరు ప్రత్యర్థిని 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు చిన్నస్వామిలో హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది.206 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్‌ 194/9 వద్దే ఆగిపోయింది. యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్‌ జురెల్‌ (34 బంతుల్లో 47, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ రాజస్థాన్‌కు మరో అపజయం తప్పలేదు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు విరాట్‌ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బౌలర్లపై

సొంతగడ్డపై ఆడిన గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్‌ మెరుగైంది. దూకుడు మీదున్న ఓపెనింగ్‌ ద్వయం ఫిల్‌ సాల్ట్‌ (26), కోహ్లీ ఆరంభం నుంచే రాజస్థాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి బెంగళూరుకు శుభారంభం అందించారు. ఆర్చర్‌ మొదటి ఓవర్‌లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టి అతడే వేసిన మూడో ఓవర్లోనూ ఫైన్‌లెగ్‌, స్కేర్‌ లెగ్‌ దిశగా ఫోర్లు కొట్టాడు.తుషార్‌ 5వ ఓవర్లో సాల్ట్‌ రెండు బౌండరీలు రాబట్టాడు. పవర్‌ ప్లే తర్వాత బంతినందుకున్న హసరంగ తన తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ను ఔట్‌ చేయడంతో బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. సాల్ట్‌ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సందీప్‌ 12వ ఓవర్లో రెండు ఫోర్లతో కోహ్లీ ఈ సీజన్‌లో ఐదో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.తుషార్‌ 15వ ఓవర్లో పడిక్కల్‌ రెండు భారీ సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో కోహ్లీ కూడా ఓ సిక్సర్‌ బాదడంతో బెంగళూరు ఖాతాలో 22 పరుగులు చేరాయి. ఆర్చర్‌ 16వ ఓవర్లో కోహ్లీ నితీశ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 95 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సందీప్‌ ఒకటే ఓవర్లో పడిక్కల్‌, పటీదార్‌ (1)ను ఔట్‌ చేసినా ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (23), జితేశ్‌ శర్మ (20 నాటౌట్‌) మెరుపులతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది. 

 IPL 2025: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం:రజత్ పటీదార్

హోరాహోరీ

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజత్ పటీదార్ బౌలర్ల అసాధారణ ప్రదర్శన వల్లే గెలుపొందామని తెలిపాడు. ‘ఇది మాకు అవసరమైన విజయం. ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. మేం అంచనా వేసిన విధంగానే ఉంది. ఈ గెలుపు క్రెడిట్ మా బౌలర్లదే. 10 ఓవర్ల తర్వాత వాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. వారు చూపిన తెగువ అమోఘం.205 పరుగుల లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు.ఒక దశలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని మేం భావించాం. వికెట్లు కోసం తెగ ప్రయత్నించాం. వికెట్లు తీస్తేనే పరుగుల ప్రవాహం అడ్డుకోవచ్చు. మా జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు. వారి ఆలోచనలు, వ్యూహాలు, సలహాలు మా విజయానికి ఉపయోగపడ్డాయి.’అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

Read Also: IPL 2025: ఆర్‌సీబీ విజయం కోహ్లీ ఏమన్నారంటే!

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.