ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) మధ్య టికెట్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం హెచ్సీఏ తమతో అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ, పరిస్థితి మారకపోతే హైదరాబాద్ను వదిలి కొత్త వేదిక కోసం వెతుకుతామని హెచ్చరించింది. అయితే, హెచ్సీఏ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది.
ఎస్ఆర్ హెచ్ లేఖ
మార్చి 30న తెల్లవారుజామున ఎస్ఆర్ హెచ్ జట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ విడుదల చేయగా, అది విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో, గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, గత రెండేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం, హెచ్సీఏకి 3,900 ఉచిత టికెట్లు అందిస్తున్నామని, అందులో 50 టికెట్లు ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్కు కేటాయించారని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లకే పరిమితమని, అయినా హెచ్సీఏ అదనంగా 20 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది.
ఎస్ఆర్ హెచ్ఆరోపణలు
ఎస్ఆర్ హెచ్ లేఖలో మరో సంచలన అంశం ఏమిటంటే, హెచ్సీఏ అధ్యక్షుడు కూడా పలుమార్లు బెదిరించారని ఎస్ఆర్ హెచ్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ పేర్కొన్నారు. “హెచ్సీఏ ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో ఎస్ఆర్ హెచ్ ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇదే నిజమైతే, బిసిసిఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్ను వదిలి, కొత్త వేదికను చూస్తాం” అని ఆయన హెచ్చరించారు.
హెచ్సీఏ అధికారుల తీరు
ఇప్పటికే స్టేడియం మొత్తం తమ నియంత్రణలోకి వస్తుందని, దీనికి అద్దె కూడా చెల్లిస్తున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. కానీ, గత మ్యాచ్లో హెచ్సీఏ అధికారులు ఎఫ్3 బాక్స్కు తాళం వేశారని, అదనంగా 20 ఫ్రీ టికెట్లు ఇవ్వకపోతే తాళం తీసే ప్రసక్తే లేదని బెదిరించారని ఎస్ఆర్ హెచ్ ఆరోపించింది.ఎస్ఆర్ హెచ్ ప్రకటన ప్రకారం, ఇది ఒక్క సంఘటన కాదు. గత రెండు సీజన్లుగా హెచ్సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని హెచ్సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని ఎస్ఆర్ హెచ్ తెలిపింది.
అధికారిక ప్రకటన
ఎస్ఆర్ హెచ్ లేఖ బయటకు రాగానే హెచ్సీఏ తక్షణమే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎస్ఆర్ హెచ్ నుంచి తమ అధికారిక ఈమెయిల్స్కి ఎలాంటి సమాచారం రాలేదని హెచ్సీఏ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని, ఈమెయిల్స్కి సంబంధించిన పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపింది.