మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, జట్టు యాజమాన్యం ఈరోజు బెంగళూరు నగరంలో భారీ విజయోత్సవ యాత్రను నిర్వహించనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ఫైనల్(IPL final)లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఈ విజయోత్సవ పరేడ్ బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కర్ణాటక శాసనసభ భవనమైన విధాన సౌధ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. వేలాదిగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. బెంగళూరు వీధులు ఆర్సీబీ జట్టు జెండాలు, అభిమానుల కేరింతలతో హోరెత్తనున్నాయి. జట్టుకు మద్దతుగా అభిమానులు ఎరుపు, బంగారు వర్ణాల దుస్తులు ధరించి ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు.
ఈ పరేడ్ చాలా ప్రత్యేకం
ఈ అపురూప విజయంపై, జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. “ఈ పరేడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది” అని ఫైనల్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు. నగరమంతా తమ విజయాన్ని ఎలా స్వాగతిస్తుందో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మాజీ సహచరులు ఏబీ డివిలియర్స్(AB de Villiers), క్రిస్ గేల్లను కూడా కోహ్లీ ఆహ్వానించాడు.ఇన్ని సంవత్సరాలుగా తమపై చూపించిన అచంచలమైన ప్రేమ, మద్దతునిచ్చిన ఆర్సీబీ అభిమానుల నమ్మకాన్ని ఈ విజయం నిలబెట్టిందని కోహ్లీ పేర్కొన్నాడు.
విజయోత్సవ యాత్ర
ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో బుధవారం ఉదయం ఒక పోస్ట్ చేసింది. “ఇది మీ కోసమే, 12వ మ్యాన్ ఆర్మీ (ఫ్యాన్స్). ప్రతి కేరింత, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి సంవత్సరం.మీ విధేయతే మాకు కిరీటం. ఈ రోజు ఆ కిరీటం మీదే” అని అభిమానులను ఉద్దేశించి పేర్కొంది.ఈ అపూర్వ విజయోత్సవ యాత్రను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు వీక్షించేందుకు వీలుగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్(Star Sports Channel)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పరేడ్ ముగిసిన అనంతరం, సాయంత్రం 6 గంటల తర్వాత ఎం. చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు కొనసాగుతాయి. ఇక్కడ అభిమానులు తమ ఛాంపియన్ జట్టును అభినందించేందుకు మరో అవకాశం లభిస్తుంది.
Read Also: Virat Kohli: ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో కోహ్లీ కీలక పాత్ర..