ఐపీఎల్లో ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు 2025 సీజన్ ఆశించినంతగా సాగడం లేదు. సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా,చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. అందరూ విఫలమైనా గుడ్డిలో మెల్లలా శివమ్ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సునీల్ నరైన్ (3/13) బంతితో పాటు బ్యాట్ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తోనూ రాణించి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనను కోల్కతా 10.1 ఓవర్లలోనే దంచేసింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది మూడో విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి.
మనోజ్ తివారీ తీవ్ర విమర్శలు
భారత మాజీ క్రికెటర్, ధోనితో కలిసి ఆడిన మనోజ్ తివారీ తీవ్ర విమర్శలు చేశారు. “చెన్నై సూపర్ కింగ్స్ బండి ఇక దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల షాట్ ఎంపిక చూస్తే ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు,” అంటూ తివారీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, పర్పుల్ క్యాప్ విజేత అయిన నూర్ అహ్మద్ను ఎనిమిదవ ఓవర్ దాకా బౌలింగ్కు తీసుకురాకపోవడంపై ప్రశ్నలు చేశారు. “సునీల్ నరైన్కు మొదటి బంతిలోనే వికెట్ పడింది. అప్పుడు ప్రత్యర్థి స్పిన్నర్లు ప్రభావితం చేస్తుంటే, మీ బౌలింగ్ స్టార్ను ముందే ఎందుకు తీసుకురాలేదు? ఇది సాధారణ క్రికెట్ సెన్స్. సాధారణంగా ధోని ఇలాంటి తప్పు చేయడు,” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆయన మరో విమర్శ చేస్తూ, “ఒకవేళ మీ వద్ద ధోనిలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే, అశ్విన్ బౌలింగ్లో ఎడమచేతివాటం బ్యాటర్లు ఉన్నా అతను స్టంప్స్ మీదుగా బౌలింగ్ చేయడం ఎలా సబబు? ఉంకా కహి నా కహి దిమాగ్ నహి చల్ రహా హై క్యా?” అంటూ ప్రశ్నించారు. ఇది కేవలం ఓ ఆటలో ఓటమి కాదు, ఇది అనుభవజ్ఞులైన ఆటగాళ్ల వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తించేదిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 103 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్కు మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల తర్వాత సీఎస్కే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్లో ధోనీ కేవలం ఒక పరుగు చేసి అవుట్ అయిన విషయం తెలిసిందే. ధోనీ అవుట్పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు ధోని అవుట్పై ప్రశ్నలు సంధించారు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి సీఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఒకానొక సమయంలో సీఎస్కే 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.