ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు, నేటి సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.ఈ ముగింపు వేడుకల్లో భాగంగా, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల విజయవంతమైన ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)లో విశేష సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సమాచారం
ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్(Shankar Mahadevan)తో పాటు ఆయన కుమారులు శివం మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత, 2025 సీజన్లో మరోసారి ఫైనల్కు అర్హత సాధించి, టైటిల్పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్కు చేరి, రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్ బరిలో నిలిచి, తమ తొలి టైటిల్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

హోరాహోరీ
ఈ రెండు జట్లకు గత 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో, ఈరోజు జరిగే ఫైనల్లో ఏ జట్టు విజయం సాధించినా, వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్(IPL title) కావడం విశేషం. ఈ నేపథ్యంలో, ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన జట్టు విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Phill Salt: ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ కు చేరుకున్న ఫిల్ సాల్ట్