ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత ఇలాఖాలో వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకున్న చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(41 బంతుల్లో 72, 5ఫోర్లు, 4సిక్స్లు), ప్రభ్సిమ్రన్సింగ్(36 బంతుల్లో 54, 5ఫోర్లు, 3సిక్స్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. పతిరన(2/45), ఖలీల్(2/28) రెండేసి వికెట్లు తీశారు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ కరన్ (47 బంతుల్లో 88, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించారు. కింగ్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/32) ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ను నమోదుచేయగా అర్ష్దీప్ (2/25), యాన్సెన్ (2/30) తలా రెండు వికెట్లు పడగొట్టారు.
పవర్ ప్లే
ఖలీల్ తొలి ఓవర్లోనే ప్రియాన్ష్ రెండు బౌండరీలతో ఇన్నింగ్స్ను ఆరంభించగా అన్షుల్ నాలుగో ఓవర్లో ప్రభ్సిమ్రన్ 6, 4 దంచాడు. ఖలీలే వేసిన 5వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ప్రియాన్ష్ నాలుగో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లే తర్వాత స్పిన్నర్ల రాకతో కింగ్స్ స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. పతిరాన 11వ ఓవర్లో ఆఖరి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించిన ప్రభ్సిమ్రన్ ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన ప్రభ్సిమ్రన్ నూర్ అహ్మద్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగాడు. ప్రభ్సిమ్రన్ను అనుసరిస్తూ నేహాల్ వధేరా(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఓ వైపు సహచరులు నిష్క్రమిస్తున్నా అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. ఆఖర్లో పది పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు శశాంక్(23), అయ్యర్, సూర్యాంశ్(1) చేజార్చుకున్నా పంజాబ్ విజయతీరాలకు చేరింది.
ప్రత్యేకంగా
మ్యాచ్ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. “ఎటువంటి మైదానంలోనైనా నాకు ఛేజింగ్ అంటే ఇష్టం. పెద్ద స్కోర్ ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం,ఆత్వవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నా ధోరణి. బయటి స్టేడియాల్లో ఆడేటప్పుడు నా ఫామ్ ఎలా ఉందనే విషయం గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవట్లేదు. ప్రస్తుతం ఎంతవరకు వీలైతే అంత ఆటను ఆస్వాదిస్తున్నాను. వర్తమానంలో ఉంటూ ప్రతీ బంతిని బాదటానికి ప్రయత్నిస్తున్నాను. బోర్డుపై భారీ లక్ష్యం ఉంటే అది బయట మైదానం అయినా హోమ్ స్టేడియం అయినా నా ఆట విధానం మారదు. కొన్నిసార్లు అది పని చేస్తుంది, కొన్ని సార్లు పని చేయదు. ఒకసారి క్రీజ్లో కుదుర్చుకోగలితే ఏ లక్ష్యమైనా ఛేదించగలనని నమ్మకం ఉంది.నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనిపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కువగా శ్రమించాను.నేనెప్పుడు మైదానంలోకి అడుగుపెట్టినా నా ఆటిట్యూడ్ హైగానే ఉంటుంది. నేను నాలుగు ముఖ్యమైన విషయాలను అనుసరిస్తున్నాను. అవి పాటిస్తే ఆటపై ప్రభావం చూపుతాయి.ఇక్కడ బ్యాటింగ్ కన్నా ఎక్కువగా ఫీల్డింగ్ కష్టంగా అనిపించింది.ఓవర్ రేట్ను కూడా కంట్రోల్ చేయాల్సి రావడంతో వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది వరకు నేను ఆడిన మైదానాలతో పోలిస్తే, ఇక్కడ తేమ మరింత ఎక్కువగా అనిపించింది.” అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
Read Also: Sports: విడాకులు తీసుకున్న మేరీకోమ్