వాహనాల తయారీలో ముఖ్యంగా విద్యుత్తు వాహనాలకు అవసరమైన రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం, చైనా వెళ్లేందుకు దేశీయ వాహన తయారీ కంపెనీల (Indian Companies) ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత మాగ్నెట్ల ఎగుమతిపై ఏప్రిల్ 4 నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏడు రేర్త్ ఎర్త్ మాగ్నెట్స్కు ప్రత్యేక ఎగుమతి లైసెన్సులను ఆ దేశం తప్పనిసరి చేసింది.
అంతర్జాతీయ ఎగుమతి ఆంక్షల దెబ్బ
అంతర్జాతీయ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ప్రాసెసింగ్ సామర్థ్యంలో 90 శాతానికి పైగా చైనాలోనే ఉంది. వీటి ఖరీదు మరీ ఎక్కువ కాకపోయినా, వాహనాలు, గృహోపకరణాలు, స్వచ్ఛ ఇంధన పరికరాల తయారీలో ఇవి కీలకమైనందున.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలపైనా ప్రభావం పడుతోంది. 4-6 వారాలకు సరిపడా వీటి నిల్వలు మన కంపెనీల వద్ద ఉన్నాయని.. అంతకుమించి దిగుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటే, మన వాహన పరిశ్రమపైనా ప్రభావం పడుతుందని అంచనా.
భారత్లో కల్లోలంగా మారిన పరిణామం
సమేరియమ్, గడోలినియం, టెర్బియం, డైస్ప్రోజియం, లూటెటియం వంటి కీలక ఖనిజాలను విద్యుత్తు మోటార్లు, బ్రేకింగ్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్లు, మిసైల్ సాంకేతికతలో వాడతారు. విద్యుత్తు వాహనాల తయారీకి ఇవి అత్యంత ప్రధానం. హైబ్రిడ్ వాహనాలు సైతం ప్రొపెల్షన్ కోసం వీటిపై ఆధారపడతాయి. సంప్రదాయ ఇంధన (ఐసీఈ) (Ice) వాహనాల తయారీలోనూ పవర్ స్టీరింగ్, ఇతర మోటరైజ్డ్ వ్యవస్థల కోసం వీటిని వినియోగిస్తున్నారు. ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది.

50 మంది ప్రతినిధులకు వీసా
40–50 మంది భారత వాహన తయారీ సంస్థల ఎగ్జిక్యూటివ్లు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ దిగుమతుల చర్చల కోసం చైనా ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే, చైనా (China) వాణిజ్య శాఖ అనుమతులు రావాల్సి ఉంది. దీనిపై సమావేశాలు త్వరలో జరిగే అవకాశముంది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ దిగుమతుల కోసం 40-50 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు వీసా లభించిందని.. అయితే ఈ విషయమై జరిగే సమావేశానికి చైనా (China) వాణిజ్య శాఖ నుంచి అనుమతులు రావడమే తరువాయి అని చెబుతున్నారు.
అమెరికా–చైనా మధ్య కొత్త ఒప్పందం
లండన్లో జరిగిన చర్చల అనంతరం చైనా(China)తో ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇది ఒక మేలు మలుపని అభివర్ణించారు. కొత్త వాణిజ్య ఒప్పందం కింద చైనా నుంచి అన్ని రేర్ ఎర్త్ మాగ్నెట్స్ను అమెరికా పొందనుందని తెలిపారు.. ఇందుకు ప్రతిగా అమెరికా కళాశాలలు, యూనివర్సిటీల్లో చైనా విద్యార్థులకు అనుమతులు ఇస్తామన్నారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు
ప్రస్తుతం ఉన్న నిల్వలు తక్కువగా ఉండటంతో, భారత EV పరిశ్రమ ఘాటైన జాప్యానికి లోనయ్యే ప్రమాదం.
దీన్ని నివారించేందుకు ఇతర ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతుల మార్గాలు అన్వేషించాల్సిన అవసరం. చైనా ఎగుమతులపై విధించిన నియంత్రణలు అంతర్జాతీయంగా ప్రత్యేకించి విద్యుత్తు వాహన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశానికి ఇది ఒక హెచ్చరికగానూ, స్థిరమైన సరఫరా దారుల వెతుకుల కోసం సాంకేతిక, వ్యూహాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి.
Read Also: PNB MD Ashok Chandra: రిటెయిల్ రుణాలపై పీఎన్బీ ఫోకస్!