Raja Singh : వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు ద్వారా దేవాలయ భూములు, రైతుల భూములు, పేదల భూములు అన్యాక్రహణం అవుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు దీనికి అడ్డుకట్ట వేయగలదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రయోజనాలను కాపాడుతుందని రాజాసింగ్ అన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు నోటీసుల ద్వారా అనేక భూములు కబ్జా చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు.

వక్ఫ్ బోర్డు చట్టంపై సమగ్ర పరిశీలన చేయాలని దీనిని పునః సమీక్షించి అన్యాయాలను అరికట్టాలని కోరారు.ఇక మరోవైపు శ్రీరామ నవమి శోభాయాత్ర అంశంపై కూడా రాజాసింగ్ స్పందించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాస్తూ, ఏప్రిల్ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వాలని కోరారు.2010 నుంచి తాను శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు లేఖలో వివరించారు. గత 15 ఏళ్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. లక్షలాది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొనే ఈ యాత్ర కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం సహకరించాలన్నారు.ఈ యాత్ర ఆకాశ్పురి హనుమాన్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వివరించారు. భక్తులు క్రమశిక్షణతో పాల్గొంటారని స్పష్టం చేశారు. అందువల్ల ఏ అవరోధాలు లేకుండా అనుమతి మంజూరు చేయాలని సీఎంకు రాసిన లేఖలో రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.