PM Modi: పహల్గాం ఉగ్రదాడిపై స్పందన: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోదీ అత్యవసర సమీక్ష

Read Time:  1 min
ఇండియా పాక్ లతో యూకే విదేశాంగ కార్యదర్శి చర్చలు
ఇండియా పాక్ లతో యూకే విదేశాంగ కార్యదర్శి చర్చలు
FONT SIZE
GET APP

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి: ప్రధాని మోదీ పర్యటన రద్దు

మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ దాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనను మద్యలోనే రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి హుటాహుటిన జెడ్డా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరుగు ప్రయాణమైన మోదీ, బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. విమానాశ్రయానికి చేరిన వెంటనే ఎయిర్‌పోర్టులోనే అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గాంలో జరిగిన దాడి తీరుపై సమగ్ర నివేదిక ప్రధానికి అందించబడింది. ఈ దాడిలో ఉగ్రవాదుల ఉనికిని ఎలా ఎదుర్కోవాలో, భవిష్యత్తు చర్యలు ఏమిటన్న అంశాలపై విస్తృత చర్చ జరిగింది.

భద్రతా వ్యవహారాలపై అత్యవసర సమీక్ష

ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై మరింత లోతైన చర్చ జరిపి, భద్రతను మరింత కఠినతరం చేయడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ భద్రతపై తీవ్రమైన ముప్పుగా ఈ దాడిని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రహస్య పద్ధతుల్లో ఉగ్రవాదంపై పెద్ద ఎత్తున కౌంటర్ చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి అధికారులకు ఆదేశించనున్నారని సమాచారం. ప్రధాని మోదీ ఇప్పటికే జాతీయ భద్రతా దళాలకు, రక్షణ దళాలకు అత్యధిక అప్రమత్తత పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

అమిత్ షా ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్ష

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ భద్రతా ఉన్నతాధికారులతో సమావేశమై పర్యవేక్షణ చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించిన ఆయన, దాడి జరిగిన ప్రదేశమైన పహల్గాంలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించనున్నారు. ఉగ్రదాడి అనంతర భద్రత చర్యలను సమీక్షించి, స్థానిక భద్రతా దళాలకు అవసరమైన మార్గదర్శకాలను అందించనున్నారు. అమిత్ షా పర్యటనతో స్థానిక భద్రతా యంత్రాంగం మరింత గట్టి చర్యలకు సిద్ధమవుతోంది.

పర్యాటకులపై దాడి: దేశాన్ని కలిచివేసిన ఘటన

కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పర్యాటకులు మస్తుగా విహరిస్తుండగా, వారిపై నిష్ఠూరమైన దాడి జరగడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ దారుణ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాల‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడి తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత భద్రతా దళాలు దీనికి తగిన బదులిచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

READ ALSO: Terror Attack : ఉగ్రదాడిపై స్థానికులు ఏమంటున్నారంటే !

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.