పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆదంపూర్ ఎయిర్బేస్లో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో కలిసి ముచ్చటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచే పాకిస్తాన్కు గట్టి సందేశం పంపించారు. భారత్కు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Air defense system) అయిన ఎస్-400 మిసైల్ సిస్టమ్ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ అబద్ధాలు చెబుతుండగా అదంతా తప్పేనని నిరూపించేందుకు ఎస్-400 మిసైల్ సిస్టమ్ ముందు నిలబడి ప్రధాని ప్రసంగించారు.ఈ నేపథ్యంలో, పాకిస్థాన్కు చెందిన ఒక జర్నలిస్టు స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి (డీజీ-ఐఎస్పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు. తప్పుడు విజయాలు ప్రకటించుకుంటున్నారని, వాస్తవానికి భారత దళాలు పాకిస్థాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, సదరు పాకిస్థానీ జర్నలిస్టు ఆదంపూర్ ఎయిర్బేస్(Adampur Airbase)లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు. “ఈ స్థావరాన్ని, ఈ ఎస్-400 వ్యవస్థను మేం నాశనం చేశామని చెప్పుకున్నాం. కానీ, నరేంద్ర మోదీ అదే ఎస్-400 ముందు నిలబడి తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేం గెలవలేదు. 1971 తర్వాత భారతదేశం పాకిస్థాన్లోని ప్రతి నగరం, ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది. మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోదీ పాకిస్థాన్కు గట్టి సందేశం ఇచ్చారు,” అని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. మోదీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని, తమవారిలో 50 మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు.
నినాదం
ఈ సందర్భంగా ఆదంపూర్ ఎయిర్బేస్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి సైనికుల ధైర్యపరాక్రమాలను ప్రపంచానికి చాటి చెబుతూ వారికి సెల్యూట్ చేశారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ ఆ నినాదం ప్రస్తుతం శత్రువుల చెవుల్లో మారుమోగిపోతోందని తెలిపారు. ఆ నినాదమే ఇప్పుడు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు.
Read Also : TRUMP: సౌదీ అరేబియాలో ట్రంప్ మాటల తూటాలు