ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడుతున్నాయంటే రెండు దేశాల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లు నిలిపేశారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో ఇప్పటికీ రెండు జట్లు తలపడితే వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. అయితే 2007లో ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ వేదికగా జరిగిన భారత్-పాక్ వన్డే మ్యాచ్ కోసం దాయాది దేశం నుంచి 32 మంది క్రికెట్ ఫ్యాన్స్ భారత్కు వచ్చారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత వారు తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉండగా అది జరగలేదు. ఆ తర్వాత నలుగురిని గుర్తించి పాక్కు తిప్పిపంపిన యూపీ పోలీసులు మిగిలిన వారి ఆచూకీ మాత్రం తెలుసుకోలేదు.ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం పాక్ వాసులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ సందర్భంగా భారత్లో నిబంధనలు అతిక్రమించి ఉంటున్న పాక్ వాసులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో లిస్ట్ తీస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి అందులో 28 మంది పాక్ ఫ్యాన్స్ గత 18 ఏళ్లుగా భారత్లోనే అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 18 ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ ఇప్పటికీ దొరక్కపోవడం సంచలనంగా మారింది.
వ్యవహారాల
ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఈ 28 మంది దేశం విడిచి వెళ్లకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎంట్రీ, ఎగ్జిట్ రికార్డులు ఉన్నప్పటికీ గత 18 ఏళ్లుగా పాక్ వాసులను గుర్తించి వెనక్కి పంపించడంలో అధికారులు విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దేశంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు.ఎవరు దేశం దాటి బయటికి వెళ్తున్నారు అనేదానిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) స్పష్టమైన రికార్డులను కలిగి ఉంది. ఒక విదేశీ పౌరుడు దేశంలోకి వచ్చి గడువు పూర్తి అయిన తర్వాత కూడా తిరిగి స్వదేశానికి వెళ్లకపోతే ఎంఈఏ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఆ తర్వాత స్థానిక పోలీసులు రంగంలోకి వారిని అదుపులోకి తీసుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం 18 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
సంవత్సరం
కేవలం పోలీసులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమా లేక అవినీతికి సంబంధించిన విషయమా అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఇది ఒక్క ఘటన మాత్రమే కాదని ప్రతీ సంవత్సరం చాలా మంది విదేశీయులు వీసాలపై వచ్చి భారత్లోనే అక్రమంగా ఉండిపోతున్నారని తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోవడమో లేక కొందరు డబ్బులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేది తేలియాల్సి ఉంది.
Read Also: Central Government: జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయం