జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన అమెరికా, భారత్కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ దాడిని హేయమైన చర్యగా అభిప్రాయపడిన అగ్రరాజ్యం, బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షించింది. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కార్యదర్శి మార్కో రూబియో స్పష్టంగా ఉన్నారని విదేశంగా ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను అమెరికా ఖండిస్తుందని చెప్పారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ పాత్ర ఉందా? రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అమెరికా తగ్గిస్తుందా అని ప్రశ్నించగా, పరిస్థితి తీవ్రత దృష్టా దీనిపై మాట్లాడామని చెప్పారు. ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడబోమని వివరించారు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రతీ అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని వివరించారు.

కాశ్మీర్ దాడితో సంతాపం ప్రకటించిన బ్రిటన్ పార్లమెంట్ ఎంపీలు
మరోవైపు బ్రిటన్ పార్లమెంట్ ఎంపీలు సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా ఉంటామని ఎంపీ బాబ్ బ్లాక్ చాన్ చెప్పారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్ కోరారు. పార్లమెంట్లో మాట్లాడిన దేశాయ్, మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ నేత ల్యూసీ పోవెల్ సైతం పహల్గాం దాడిని పిరికిపంద చర్యాగా అభివర్ణించారు. అంతకుముందు ఏప్రిల్ 23న ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఎక్కడ చూసినా కన్నీటి గాధలే !
జమ్ము కశ్మీర్లోని పహల్గాం సమీప మినీ స్విట్లర్లాండ్గా పిలిచే బైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి, అతి సమీపం నుంచి కాల్పులు చేశారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోగా, వారి కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించాయి.
Read Also: Donald Trump: జార్జియా కోర్టు తీర్పుతో భారతీయ విద్యార్ధులకు ఊరట